హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణమాఫీ ప్రక్రియపై సీఎం చంద్రబాబు మంగళవారం మంత్రివర్గ సహచరుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ లో చంద్రబాబు తన కేబినెట్లోని పలువురు మంత్రులతో భేటీ అయి... రుణమాఫీ అంశంపై చర్చించారు. అధికారంలోకి వచ్చి అరు నెలలవుతున్నా రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితా సిద్ధంకాక పోవడంపై చంద్రబాబు తన మంత్రులపై ఆగ్రహించారు. రుణమాఫీపై జాబితా సిద్ధమైందా అని ప్రశ్నించగా.... మంత్రుల నుంచి సరైన సమాధానం రాలేదు. దాంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ తొలి విడతలో రైతులకు ఎంత మొత్తం చెల్లించాలనే విషయంపై యనమల నేతృత్వంలో మంత్రులు సమావేశం కావాలని ఆదేశించారు. ఆ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుని తన వద్దకు రావాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశంపై చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం మంత్రులతో అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేయనున్నారు. తాము అధికారంలోకి వస్తే... రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చారు.
ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు అయినా ఆ హామీ అమలుకాకపోవడంపై ప్రతిపక్షాలు, రైతులు ప్రజల చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.