స్వీయ నిర్బంధం.. అవమానించారనే | Sakshi
Sakshi News home page

స్వీయ నిర్బంధం.. అవమానించారనే

Published Thu, Nov 27 2014 1:45 AM

స్వీయ నిర్బంధం.. అవమానించారనే

గుంటూరు మెడికల్ :న్యాయబద్ధంగా తనకు రావాల్సిన పదోన్నతిని అడ్డుకోవడమే గాకుండా... తనను వేరే చోటకు బదిలీచేసి.. ఆ ఉత్తర్వులను ఇంటిగోడకు అతికించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సంఘం జీజీహెచ్ అధ్యక్షుడు డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ బుధవారం వినూత్న నిరసన తెలిపి కలకలం రేపారు. ఆస్పత్రిలోని 333నంబర్ వార్డులోగల తన గదిలో స్వీయనిర్బంధం చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న అతనికి అత్యంత సన్నిహితుడు, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం విజయసారధి గదికిటికీ సందులోంచి ఎంతగా బయటకు రావాలని పిలిచినా ఆయన స్పందించలేదు. తరువాత ఆయన భార్య డాక్టర్ వనజ, కుమారుడు అనుదీప్, గుంటూరు వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శైలబాల గదివద్దకు చేరుకుని పలుమార్లు కోరినా ఫలితం లేకపోరుుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, డాక్టర్ ఫర్నికుమార్, డాక్టర్ శ్రీనివాసప్రసాద్, డాక్టర్ రాజ్యలక్ష్మి, నర్శింగ్ సిబ్బంది, పోలీసులు, రోగులు, అధికసంఖ్యలో మీడియా ప్రతినిధులు గది వద్దకు చేరుకున్నారు.

కుటుంబ నియంత్రణ విభాగం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మండవ శ్రీనివాసరావు చొరవతీసుకుని కిటికీలోంచి లోపలికి ప్రవేశించి కాసేపు ఆయన్ను సముదారుుంచి తలుపు తీశారు. జీజీహెచ్‌లో  ఉదయం 9 గంటల నుంచి 11. 30 గంటల వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు డాక్టర్ కిరణ్‌కుమార్‌కు జరిగిన అన్యాయం గురించి, అవమానాల గురించి మీడియాకు వివరించారు.

డాక్టర్ కిరణ్‌కుమార్ కూడా ఆవేదనతో మీడియాతో మాట్లాడారు. తనకు పదోన్నతి రాకుండా అన్యాయం చేశారనే విషయాన్ని ఈ నెల 12న  జాతీయ ఎస్సీ కమిషన్‌కు తెలియజేశాననీ, అందుకు డీఎంఈ, హెల్త్ సెక్రటరీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ తనను మానసిక వేధింపులకు పాల్పడ్డారనీ, ట్రాన్స్‌ఫర్ చేశారని ఆరోపించారు. ఈ నెల 21 వ తేదీన ఢిల్లీలో ఎస్సీ కమిషన్ మెంబర్ పి.ఎమ్.కమలకుమారి తనను విచారణ జరుపుతుండగానే తనను తిరుపతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారన్నారు.

తాను ఫిర్యాదు చేశానన్న కారణంతోనే బదిలీ చేయటమే కాకుండా ఆ ఉత్తర్యులు తన ఇంటి గోడపై అంటించి ఫొటోలు తీసి తనను అవమానించారని వాపోయూరు. జీజీహెచ్‌లో కూడా సూపరింటెండెంట్ తనను పలుమార్లు అవమానించారని, తనకు జరిగిన అన్యాయానికి, న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలో తెలియక తనను తాను నిర్బంధించుకున్నాననీ, ఆత్మహత్యకు పాల్పడనని ఈ మేరకు ఆర్బన్ ఎస్పీకి లేఖ రాస్తున్నానని కిరణ్‌కుమార్ వివరించారు.

Advertisement
Advertisement