బాబును నమ్ముకుంటే గంగపాలే | Sakshi
Sakshi News home page

బాబును నమ్ముకుంటే గంగపాలే

Published Thu, Sep 26 2013 3:04 AM

Babu relied gangapale

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : చంద్రబాబును నమ్ముకుంటే తెలంగాణ టీడీపీ నాయకులు గంగలో మునిగినట్లేనని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి హెచ్చరించారు. నిజంగా ఆ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉంటే సకల జనభేరిలో కలిసి రావాలని సూచించారు. టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కు చెందిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు ఉద్యమిస్తుంటే టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారిని ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. ఎర్రబెల్లి, రేవూరిలు ఏం సాధించారని ముద్దులాడుకుంటున్నారో చెప్పాలన్నారు
 
 . తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు సీమాంధ్ర నాయకులు ప్రాంతీయ, కుల అహంకారంతో మాట్లాడుతున్నారని, వారిపై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ముట్టడిస్తామంటున్న వారికి హెచ్చరికగానే ఈ నెల 29న సకల జనభేరి సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌పై కిరికిరి, షరతులతో కూడిన తెలంగాణ అంటే సహించేది లేదని తేల్చిచెప్పారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, మొలుగూరి భిక్షపతి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు దోనేపూడి రమేష్‌బాబు, వరదారెడ్డి, గుడిమల్ల రవికుమార్, ఆరూరి రమేష్, నూకల నరేష్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, డాక్టర్ సుధాకర్‌రావు, కమరున్నీసా, లలితాయాదవ్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement