గ‘లీజు’ | Sakshi
Sakshi News home page

గ‘లీజు’

Published Wed, Apr 20 2016 2:16 AM

become the teaching hospital

అప్పుడు ఐదేళ్లు ..   ఇప్పుడు 35 ఏళ్లు
కనుమరుగుకానున్న     జిల్లా ఆస్పత్రి
టీచింగ్ ఆస్పత్రిగా మారనున్న వైనం


ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటు వైద్య సంస్థలకు అప్పగిస్తూ గత ఏడాది వివాదాస్పద నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో తప్పటడుగేసింది. ఐదేళ్లు ఉన్న లీజు కాలాన్ని 35 ఏళ్లకు పొడిగిస్తూ సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనివెనుక ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులందాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

 చిత్తూరు (అర్బన్): జిల్లా కేంద్రంలో పేద రోగుల ఆలనాపాలనా చూసే ప్రభుత్వాస్పత్రి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని పూర్తిస్థాయిలో ప్రయివేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ‘లీజు’ ఒప్పందానికి తెరతీయడం విమర్శలకు తావిస్తోంది.

 
ఆ ఒప్పందం వెనుక

మార్కెట్‌లో ఎంబీబీఎస్‌పై ఇప్పటికీ క్రేజ్ ఉంది. యాజమాన్య కోటా కింద పేరొందిన పలు ఆస్పత్రులు ఒక్కో సీటుకు రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు డొనేషన్లు కట్టించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అపోలో వైద్య సంస్థలు చిత్తూరులో పాగావేసేందుకు పావులు కదిపాయి. కానీ ఇక్కడ పక్కా ఆస్పత్రి భవనం లేకపోవడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాక్టీస్ చేసుకునేందుకు సిద్ధపడ్డాయి. ఈ మేరకు ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాయి. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు బోధన, ప్రాక్టికల్స్ చేయడానికి  అనుమతివ్వాలని విన్నవించా యి. దీనిపై సర్కారు సానుకూలంగా స్పందించింది.

 
గ‘లీజు’ ఒప్పందం

అపోలో వైద్య సంస్థల అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ మేరకు గత ఏడాది ఆస్పత్రి భవనాన్ని ఐదేళ్లకు లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఐదేళ్ల తర్వాత అపోలో సంస్థ చిత్తూరు ఆస్పత్రిని వదలి వెళ్లాలి. క్లీనికల్ అటాచ్‌మెంట్ సమయంలో ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన పరికరాలు, ఇతర సాంకేతిక వ్యవస్థను సైతం అలాగే వదిలేయాలి. ఇలాచేస్తే అపోలో వైద్య సంస్థకు భారీగా నష్టం వాటిల్లే పమాదం ఉంది. అలా జరగకుండా ఉండేందుకు ఐదేళ్ల కాలాన్ని 35 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం లీజు ఒప్పందం కుదుర్చుకుంది. దీనివెనుక కొందరు ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారికి భారీ మొత్తంలో ముడుపులందాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 
పూర్తి స్థాయిలో పాగా

ఇప్పటికే చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అపోలో వైద్యులు, సిబ్బంది వైద్యసేవలందిస్తున్నారు. ఇక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం చిత్తూరు ఆస్పత్రిని సందర్శించి అనుమతి ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఇక్కడ పాగా వేసేందకు పావులు కదుపుతోంది.

 
అక్కడ అలా..

కర్ణాటక రాష్ట్రంలో ఇదే తరహాలో ప్రభుత్వాస్పత్రిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తొలుత ఐదేళ్లు లీజుకు ఇచ్చారు. లీజుకాలం పూర్తయింది. కానీ ప్రభుత్వాస్పత్రిని ఖాళీ చేయలేదు. చిత్తూరు ఆస్పత్రిలో కూడా అదే తరహాలో అపోలో వైద్య సంస్థలు శాశ్వతంగా పాగా వేయనున్నాయి. ఈ మే రకు రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement