నమ్మించి మోసం చేశాడు.. | Sakshi
Sakshi News home page

నమ్మించి మోసం చేశాడు..

Published Wed, Jul 8 2015 4:36 AM

నమ్మించి మోసం చేశాడు.. - Sakshi

కృష్ణలంక : తనను ప్రలోభపరిచి గర్భవతిని చేశాడని యువతి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. గంగానమ్మ గుడికి చెందిన ఓ యువతి కృష్ణలంక నెహ్రూనగర్ సమీపంలోని ఫీడర్ రోడ్డుపై ఉన్న ప్రముఖ ప్రైవేట్ స్కూల్‌లో యేడాదిగా రిసెప్షెనిస్టుగా  పనిచేస్తోంది. అదే స్కూల్‌లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా గుంటూరుకు చెందిన ఎం. సురేష్ (32) మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి ఇదివరకే పెళ్లి కాగా, భార్య గుంటూరులో ఉంటోంది.

సురేష్ మాత్రం స్థానికంగా నెహ్రూనగర్‌లో నివాసముంటున్నాడు. కాగా, గత ఏప్రిల్ నెలలో స్కూల్ అడ్మిషన్స్ కోసం సదరు యువతి రోజూ స్కూలుకు వచ్చేది. దీన్ని అవకాశంగా తీసుకున్న సురేష్ ఆమెను ప్రలోభపెట్టి వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇదిలా ఉండగా గత నెలాఖరున ఆమెకు తాను గర్భవతినన్న విషయం తెలిసింది. ఇద్దరూ విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. గత శుక్రవారం యువతికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆపరేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో సోమవారం ఆమె కుటుంబసభ్యులకు అసలు విషయం తెలిపింది. కోపోద్రిక్తులైన ఆమె కుటుంబసభ్యులు మంగళవారం స్కూలుదగ్గరకు వచ్చి సురేష్‌తో గొడవపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణలంక సీఐ మూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
ఇంట్లో బంధించి భార్యపై వేధింపులు

చిట్టినగర్ : భార్యపై అనుమానంతో ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్న భర్తపై కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతరాజరాజేశ్వరిపేటకు చెందిన తూతిక నాగలక్ష్మి(24) ఎలక్ట్రిషియన్ పని చేసే సత్యనారాయణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకున్నాడు. అయితే గత కొంత కాలంగా సత్యనారాయణ భార్యను అనుమానంతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో బంధించి ఇష్టానుసారంగా కొట్టడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement