Sakshi News home page

భువనగిరి ఎంపీ స్థానంపై అందరికీ ఆశ

Published Fri, Nov 29 2013 3:31 AM

bhuvanagiri M.P seate having eyes to leaders

సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్‌లో భువనగిరి లోక్‌సభస్థానం కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కాదని తమకంటే..తమకు ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఆ పార్టీలోని కొందరు నేతలు వంతపాడుతున్నారు. దీంతో జిల్లా పార్టీలో ప్రచ్ఛన్న పోరు మొదలైంది. ఇప్పటికే ఢిల్లీస్థాయిలో కూడా ఎంపీకి వ్యతిరేకంగా నివేదికలు అందజేసిన నాయకులు కొద్దిరోజులు మౌనం పాటించారు. కానీ, తాజాగా సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి తన కొడుకుకోసం విలేకరుల సమావేశంలో బహిరంగంగానే టికెట్ అడిగేశారు. దీంతో ఎంపీ రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తా రు. ఈ ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై జిల్లా సీనియర్‌నేతలు  నోరు మెదపడం లేదు.
 
 గుంపుల గొడవ
  2009 ఎన్నికల్లో జిల్లాలో సీనియర్లు జానారెడ్డి, దామోదర్‌రెడ్డిలను కాదని వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అవకాశం కల్పిం చారు. దీనికి బలమైన కారణమే ఉంది. ఒక్కోనాయకుడు అదనంగా ఒక్కో అసెంబీ ్లస్థానంలో తమవారికి టికెట్ ఇప్పించుకున్నా ఒక్కరూ గెలిపించుకోలేదు. ఇలా, కోదాడ, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలు చేజారాయి. వీటితో పాటు మునుగోడు, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కానీ, కోమటిరెడ్డి తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని భువనగిరి ఎంపీగా, చిరుమర్తి లింగయ్యను నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.
 
 దీంతో జిల్లా కాంగ్రెస్‌పై ఆయన పట్టు బిగించారు. అప్పటి నుంచే కోమటిరెడ్డి, ఆయన వ్యతిరేకవర్గాలుగా జిల్లా కాం గ్రెస్ చీలిపోయింది. వైఎస్సార్ మరణానంతరం జానారెడ్డి తిరిగి మంత్రివర్గంలో చేరారు. తెలంగాణ డిమాండ్‌తో కోమటిరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీలో ఉంటూనే పోరాడారు. జిల్లాలో మంత్రి పదవి ఖాళీ కావడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అవకాశం దక్కింది. ఈ రెండు పరిణామాల తర్వాత జిల్లా కాంగ్రెస్ స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కోమటిరెడ్డి సోదరుల వ్యతిరేకులంతా ఓ తాటిపైకి వచ్చారు. వీరంతా కలిసి, ఎంపీ రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు తయా రుచేయించి ఢిల్లీకి పంపారన్నది ఎంపీ వర్గీయుల వాదన.
 
 వ్యూహాత్మకంగా.. రాజగోపాల్‌రెడ్డి అడుగులు
 ఈ పరిణామాల నేపథ్యంలోనే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి విసృ్తతంగా పర్యటిస్తున్నారు. ఇక, ప్రభుత్వ అధికారిక కార్యక్రమం రచ్చబండలో ఏ కార్యక్రమాన్నీ విడిచిపెట్టకుండా హాజరయ్యారు. ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో అక్కడి నేతలతో కలిసి వేదికలను పంచుకున్నారు. ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డితోనూ సర్దుబాటు చేసుకున్నట్లే కనిపించింది. ఒకవిధంగా తనకు వ్యతిరేక వర్గం లేకుండా అందరితో కలిసిపోవడం, అందరినీ కలుపుకొనిపోవడం అన్న వ్యూహంతో ఎంపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితులను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న కారణంగానే.. హైదరబాద్‌లో సీఎల్పీ వేదికగా తన తనయుడి టికెట్ గురించి మాట్లాడి మీడియాలో ప్రచారం పొందాలని, రాష్ట్ర నాయకత్వానికి తన కోరికను ఇలా వెల్లడించేందుకు దామోదర్‌రెడ్డి ప్రయత్నించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 ‘ఒక నాయకుడు కొడుకు కోసం, మరో నాయకుడు భార్య కోసం, ఇంకో నాయకుడు కోడలు కోసం... ఇలా అందరూ తమ కుటుంబ సభ్యులకు టికెట్లు అడుగుతున్నారు. ఇది అధికా రం కోసమే కానీ, ప్రజాసేవ కోసం కాదు. ప్రజలకు అన్నీ తెలుసు...’ అంటూ రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగానే వ్యాఖ్యానించారు.
 
 వైపు తమ సొంత ఎంపీకి వ్యతిరేకంగా ఇలా కుట్రలు చేయడం ఏమిటి..? ఇది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకోవాల్సిన  సీట్లపై ప్రభావం చూపదా..? అన్న చర్చా జరుగుతోంది. భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా జిల్లాకు చెందిన ఓ మంత్రి తెరవెనుక తతంగం నడిపారని, అధికారుల పోస్టింగులు మొదలు, వివిధ అభివృద్ధి పనులకు నిధులు రాకుండా అడ్డుపడ్డారనీ చెబుతున్నారు.
 
 ‘తెలంగాణ కోసం నిత్యం సొంత పార్టీపై, మరీ ముఖ్యంగా సీఎంపై విరుచుకుపడుతున్న కోమటిరెడ్డి సోదరులకు వ్యతిరేకంగా సీఎం కూడా పావులు కదిపారు. కొందరని దగ్గరకు తీసి చెప్పిందల్లా చేశారు. ఆ రకంగా ఎంపీపై పార్టీ అధిష్టానం వద్ద వ్యతిరేకతను పెంచే ప్రయత్నా లు చేశారు. అయినా, అధినాయకత్వానికి అన్నీ తెలుసు..’ అని పార్టీ నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టికెట్లు ఖరరాయ్యే దాకా కాంగ్రెస్‌లో గుంపుల లొల్లి సమ సేలా కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Advertisement

What’s your opinion

Advertisement