పూడూరు, న్యూస్లైన్: ‘హమ్మయ్యా.. బతికి పోయాం.. ఈరోజు అదృష్టం మంచి గుంది.. బైకు మీదినుంచి దూకకపోయింటే చచ్చేటొళ్లం..’ అని ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరు యువకులు తీవ్ర భయాందోళనతో అన్న మాటలు ఇవి. బస్సు బైకును ఓవర్ టేక్ చేస్తూ దానిని ఢీకొంది. ప్రమాదంలో బైకు బస్సు చక్రాల్లో చిక్కుకొని నుజ్జునుజ్జయింది. ఈ సంఘటన శనివారం పూడూరు మండలం మన్నెగూడలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు (ఏపీ 28 జెడ్ 448) శనివారం హైదరాబాద్ బయలు దేరింది.
అంగడి చిట్టెంపల్లికి చెందిన యువకులు అనిల్, మురళిలు బైకుపై వికారాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ-మిర్జాపూర్ మధ్యలో వీరి బైకును బస్సు ఓవర్ టేక్ చేస్తూ ఒక్కసారిగా దానిపైకి దూసుకుపోయింది. అప్రమత్తమైన యువకులు బైకు పైనుం చి దూకేశారు. బైకు బస్సు చక్రాల్లో ఇరుక్కొని నుజ్జునుజ్జయింది. యువకులు బైకు పైనుంచి దూకకపోతే ప్రాణాలు పోయేవి. చన్గొముల్ ఎస్ఐ మక్సూద్ అలీ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన అనిల్, మురళిని ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సు రోడ్డు పైనుంచి కొద్దిగా కిందికి దూసుకుపోయింది.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ‘ఈరోజు బాగుంది.. ప్రమాదం నుంచి బయటపడ్డాం.. ప్రాణాలు పోయేవి’ అని క్షతగాత్రులు అనిల్, మురళి తీవ్ర భయాందోళనతో చెప్పారు. బస్సును పోలీసులు పీఎస్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.