సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఆడియో టేపులు బయటపడిన వ్యవహారం మిత్రపక్షమైన బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు నేరుగా నామినేటెడ్ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన సంభాషణ అంశంపై ఆయనకు మద్దతుగా ఎలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేయరాదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయించింది. సమర్థనీయం కాని చర్య అయినా మిత్రపక్ష పార్టీ అధినేత కాబట్టీ వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న అభిప్రాయానికి వచ్చినట్టు ఏపీ శాఖ బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై కొంతకాలం మౌనం పాటించడమే మంచిదన్న భావనతో ఉన్నట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ కేసులో రేవంత్రెడ్డి అడ్డంగా దొరికిపోగా, టెలిఫోన్ సంభాషణలో చంద్రబాబు పేరు వెల్లడి కావడమన్నది ప్రాంతాల మధ్య సమస్యగా చూడలేమని, వ్యక్తిగత విషయాలు రాష్ట్రాల మధ్య వివాదాలుగా పరిగణించలేమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కేసు వ్యవహారంలో పార్టీ జాతీయ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది గమనించి ఆ దిశగానే వ్యవహరించాలని భావిస్తున్న రాష్ట్ర శాఖ నేతలు కొందరు కేంద్రం వైఖరిని తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.