చంద్రబాబువి నిలకడలేని మాటలు | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి నిలకడలేని మాటలు

Published Sat, Sep 5 2015 4:08 AM

చంద్రబాబువి నిలకడలేని మాటలు - Sakshi

- అయోమయంలో ముస్లిం మైనార్టీలు
- ధ్వజమెత్తిన వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ నేతలు
కడప కార్పొరేషన్ :
రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్న నిలకడ లేని మాటలతో ముస్లిం మైనార్టీలు తీవ్ర అయోమయానికి, గందరగోళానికి గురవుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌లాజం, జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంజిలానీ, మైనార్టీ అధ్యక్షుడు ఎస్‌ఏ కరిముల్లా తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తానని, బ్యాంకుల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా వాటి ఊసే లేదన్నారు. దుకాన్, మకాన్, దుల్హన్ స్కీం అని చెప్పి మాటలకే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు.

టీడీపీ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం కూడా మంత్రిగా లేరని, దీన్ని బట్టే మైనార్టీలపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంద ని ఘాటుగా విమర్శించారు. కడపలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఉర్దూ యూనివర్సిటీ స్థానంలో హజ్‌హౌస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, దాన్ని కూడా వేరొక చోటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జిల్లా ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారో, ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి డిప్యూటీ ఛెర్మైన్ సతీష్‌రెడ్డి, విప్ మేడా మల్లికార్జునరెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన హమీలు అమలు చేయించాలని, లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి చాంద్‌బాషా, నాయకులు పవర్ అల్తాఫ్, మున్నా, ఆయుబ్, జఫ్రుల్లా పాల్గొన్నారు.

Advertisement
Advertisement