సారు...బిజీ! | Sakshi
Sakshi News home page

సారు...బిజీ!

Published Mon, Jan 20 2014 2:22 AM

సారు...బిజీ! - Sakshi

సీమాంధ్రలో కాంగ్రెస్ పక్షాన గెలవలేమని గ్రహించి మరో గత్యంతరం లేక ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ ఒకరు టీడీపీలో చేరాలని భావించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వస్తానంటే వద్దంటానా అంటూ టీడీపీ నాయకత్వం నుంచి వెంటనే గ్రీన్‌సిగ్నల్ లభించింది. రాష్ట్రాన్ని విభజించండి కానీ సమన్యాయం చేయాలంటూ ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సదరు ఎంపీ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఇక సమయం చూసుకుని టీడీపీలో చేరడమొక్కటే మిగిలింది. కానీ కొద్ది రోజుల కిందట నుంచి పరిస్థితి తారుమారైందట. ఎంపీ గారి సీటుపై చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రిగారి పుత్రరత్నం కన్నేశారు. టికెటిస్తే జిల్లాలో మొత్తం ఎన్నికల ఖర్చే కాకుండా ఓ పది కోట్లు పార్టీకి చందాగా ఇస్తానని కూడా ఆయన హామీనిచ్చారట.

లాభసాటి బేరం రావడంతో సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీని పార్టీలో చేర్చుకునే విషయాన్ని బాబుగారు పక్కనపెట్టారట. గతంలో ఎప్పుడు ఫోన్ చేసినా... చెప్పండి రావుగారు అని ఎంతో పాతమిత్రుడిలా అప్యాయంగా పలకరించే చంద్రబాబు ఇప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తటం లేదట. ఎంపీ గారి నుంచి ఫోన్ అని చెప్పగానే.. సార్ బిజీగా ఉన్నారని చెప్పండి అని వ్యక్తిగత సిబ్బందికి ఆదేశాలు వెళుతున్నాయట! అటుఇటుగా మొత్తమ్మీద విషయం తెలుసుకున్న ఎంపీగారు తనను టీడీపీ అధినేత వద్దకు తీసుకెళ్లడంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన జిల్లా నేతలకు ఫోన్లు చేసి చెడామడా తిట్టేస్తున్నారట. ఆ ఎంపీగారి తిట్లను భరించలేక మధ్యవర్తులు సైతం ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదట. ఇదీ సంగతి!!
 

Advertisement
Advertisement