చంద్రబాబు దీక్ష దేనికోసమో చెప్పాలి:హరీష్ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దీక్ష దేనికోసమో చెప్పాలి:హరీష్

Published Sun, Oct 6 2013 4:45 PM

చంద్రబాబు దీక్ష దేనికోసమో చెప్పాలి:హరీష్ - Sakshi

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీక్ష దేనికోసం చేస్తున్నారో చెప్పాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.  గడ్డితినైనా అధికారంలోకి రావడం బాబు సిద్ధాంతం అన్నారు. ఆనాడు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖలో తెంగాణకు అనుకూలం అని చెప్పింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.

రెండు రూపాయల బియ్యంను 5 రూపాయలు చేసింది చంద్రబాబు. ఉచిత విద్యుత్ను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు  9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెబుతాబుతున్నారు. రాష్ట్రంలో బెల్టు షాపులను పరిచయం చేసింది చంద్రబాబు.   కిరణ్ ప్రభుత్వపై అవిశ్వాసం పెడితే మద్దతు పలికింది చంద్రబాబు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. నయవంచనకు మారు పేరు చంద్రబాబు, అవకాశవాదానికి మారుపేరు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రోజుకో మాట మాట్లాడటంలో దిట్ట అన్నారు.  చంద్రబాబు మాటలు మార్చడాన్ని చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయన్నారు.

వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబు తరువాతే ఎవరైనా అని విమర్శించారు. గులాబీ కండువా కప్పుకొని ఆనాడు చంద్రబాబు తెలంగాణకు మద్దతు పలకలేదా? అని అడిగారు.  తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒకప్పుడు కంప్యూటర్ వద్ద చంద్రబాబు కూర్చుకున్న ఫొటో ఉండేదని, ఇప్పుడు నాగలి పట్టిన చంద్రబాబు ఫొటో ఉందని తెలిపారు. నాగలిపట్టిన ఫొటో పెట్టినంత మాత్రాన జనం నమ్ముతారా? అని ప్రశ్నించారు.
 
 గతంలో బీజేపీ కారణంగానే ఓడామని ఆరోపణలు చేసిన చంద్రబాబు, ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఢిల్లీలో వెంపర్లాడుతున్నాడని ఆరోపించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని హైదరాబాద్లో అడుగుపెట్టనివ్వ అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇటీవల మోడీతో ఒకే వేదికను పంచుకొని ఆయనను పొగడ్తలతో ముంచెత్తడాని హరీష్ రావు తప్పుపట్టారు.

Advertisement
Advertisement