ప్రత్యేక హోదా సాధించే దమ్ము చంద్రబాబుకు లేదు | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా సాధించే దమ్ము చంద్రబాబుకు లేదు

Published Thu, May 19 2016 5:56 AM

ప్రత్యేక హోదా సాధించే దమ్ము చంద్రబాబుకు లేదు - Sakshi

 డీసీసీ అధ్యక్షుడు పనబాక  
 
కోట: కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దమ్ము, ధైర్యం సీఎం చంద్రబాబుకు లేవని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ధ్వజమెత్తారు. బుధవారం ఆయన కోటలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీస్తే తర్వాత జరిగే పరిణామాలేమిటో చంద్రబాబుకు తెలుసన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఇప్పుడు మాటమార్చి తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రయోజనముండదన్నారు. ఉద్యమాల ద్వారానే కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేకహోదా సాధించవచ్చన్నారు. కాంగ్రెస్ అందుకు సమాయత్తమవుతోందన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో భవిష్యత్తులో ఏపీకి సాగు,తాగు నీటి ఇబ్బందులు తప్పవన్నారు. ఓటు కు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం నోరు విప్పడం లేదన్నారు.


పలువురికి పదవులు
కోట, వాకాడు, చిట్టమూరు మండలాల బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షుడిగా చిట్టమూరు మండలానికి చెందిన దువ్వూరు మధుసూవన్‌రెడ్డిని నియమించారు. వెంకన్నపాళేనికి చెందిన గుర్రం అశోక్‌ను జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా, కోటకు చెందిన తీగల సురేష్‌ను జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా నియమించినట్లు కృష్ణ య్య ప్రకటించారు. సమావేశంలో దువ్వూరు శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జున్‌రావు, తాజుద్దీన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement