పార్టీలు మారడం ఆయనకే చెల్లు | Sakshi
Sakshi News home page

పార్టీలు మారడం ఆయనకే చెల్లు

Published Mon, Jan 20 2014 4:59 AM

changeing partys not new think

పార్టీలు మారడం మంత్రి టీజీకి కొత్తేమీ కాదని.. ఇప్పటికే ఆయన అన్ని పార్టీలు చుట్టేసి వచ్చారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీజీది కాంగ్రెస్ సంస్కృతి కాదన్నారు. ఎలాగూ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని.. ఎంత త్వరగా బయటకు వెళితే అంత మంచిదన్నారు. కాంగ్రెస్ వల్లే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని.. రాజకీయాల్లోనూ ఎదుగుదల సాధ్యమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతానికి వెళ్లి శంకుస్థాపనలు చేయాలే కానీ.. జిల్లా కేంద్రంలో ఉండి వ్యవహారం నడిపితే ఎలాగని ప్రశ్నించారు.

ఆ పనులన్నింటికీ తాను ఆయా ప్రాంతాలకు వెళ్లి తిరిగి శంకుస్థాపన చేస్తానన్నారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండగా.. టీజీ చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. 2004లో ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తానే తగుటబెట్టినట్లు ఆరోపించడం సత్యదూరమన్నారు. కార్యకర్తలు ఆవేశంతో చేసిన పొరపాటును తనకు అంటగట్టడం సరికాదన్నారు. తాను ఎన్నటికీ పార్టీ మారనని.. చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి టీజీ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్న విషయమై విలేకరులు ప్రశ్నించగా.. అది కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు చూసుకుంటారని దాటవేశారు. విభజన వల్ల ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చునని, 2019లో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమన్నారు.
 

Advertisement
Advertisement