సాక్షి, తిరుపతి : వైఎస్సార్సీపీ అధినేత..విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా పూజలు చేశారు. ముస్లింలు దర్గాల్లో ప్రార్థనలు చేశారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా దూసుకెళ్తున్న జగన్ను చూసి ఓర్వలేక టీడీపీ ఆధ్వర్యంలోనే కుట్ర నడిచిందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు వాస్తవాలను ప్రజలకు కళ్లకు కడుతున్నాయని పేర్కొన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని పుంగనూరులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. వాల్మీకిపురంలోని షిర్డిసాయి ఆలయంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.
తిరుపతిలో యువనేత భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం సమీపంలోని వినాయకుని ఆలయం వద్ద నగర పార్టీ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలి చలికం కుసుమ పలువురు పార్టీ నాయకులు, మహిళా నాయకులుకొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అలిపిరి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు హరిప్రసాద్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి సంగీత సారథ్యంలో కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహిం చారు. శ్రీకాళహస్తిలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు వడ్లతాంగాల్ బాలాజీరెడ్డి ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. చిత్తూరులో పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యవేడులో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి జగన్ త్వరగా కోరుకోవాలని వేడుకున్నారు. పీలేరులోని శివాలయం, దర్గాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ఆలయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలయాలు, దర్గాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.