ఫొటో కప్పు..అందరు మెచ్చు | Sakshi
Sakshi News home page

ఫొటో కప్పు..అందరు మెచ్చు

Published Thu, Jan 16 2014 4:48 AM

Close to a prize-giving Etiquette

క్రిస్‌మస్.. న్యూ ఇయర్.. సంక్రాంతి.. ఉగాది.. దసరా.. దీపావళి.. బర్త్‌డే.. మ్యారేజ్ డే..  ఇలా పండుగేదైనా.. సంబరమేదైనా ఆనంద సమయాల్లో ఆప్తులకు ఓ బహుమతి ఇవ్వడం రివాజు. మనం ఇచ్చే గిఫ్ట్ ఆనంద క్షణాలకు కొనసాగింపుగా.. ప్రతి రోజూ గుర్తు చేసుకునేలా ఉండాలి. తీసుకునే వారికి మధురానిభూతి .. చూసేవారికి ఆసక్తి కలగాలి. అలాంటి గిఫ్ట్‌లే ఫొటో కప్పులు. ప్రియమైన వారి అందమైన చిత్రాలు ముద్రించిన కప్పులను వారికి బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు పరిపాటిగా మారింది. ఫొటోలను చూస్తూ.. టీని ఆస్వాదిస్తూ.. జ్ఞాపకాలను నెమరేసుకునే కప్పులపై ఈ వారం ట్రెండ్.
 - న్యూస్‌లైన్, కర్నూలు(అర్బన్)
 
 ఇటీవల కాలంలో చాలా ఇళ్లల్లో చిన్న సైజు టీ కప్పుల వాడకం దాదాపు తగ్గిపోయింది. ధనవంతులు, అధికారులు, ఇతర వ్యాపార వర్గాలకు చెందిన వారు పెద్ద పెద్ద కప్పులను వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విభిన్న రంగుల్లో ఇవి లభ్యమవుతున్నాయి. వీటిపై తమకు ఇష్టమైన వారి ఫొటోలను ముద్రించి ఇస్తే ఆ అనుభూతి వేరు. ఇటీవల కాలంలో ఇలాంటి కప్పులను బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వివిధ  రకాల్లో లభ్యమవుతున్న పెద్ద కప్పులు ఇంటి హూందాతనాన్ని తెలియజేస్తున్నాయి. కేవలం ఓ గంటలో ఈ రకమైన కప్పులపై ఫొటోలను ప్రింట్ వేస్తున్నారు. ముద్రణ చిరకాలం మన్నికగా ఉంటుండడంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇటువంటి ఫొటో కప్పులు ధర రూ. రూ.400 నుంచి రూ.550 వరకు ఉన్నాయి.
 
 ఇన్‌సైడ్ కలర్
 తెలుపు రంగు కప్పులకు ఇన్‌సైడ్‌లో ఎరుపు, పసుపు, గోల్డ్, నీలం.. తదితర రంగుల్లో ఉండడంతో ఆకట్టుకుంటున్నాయి. వీటి ధర రూ.350గా ఉన్నాయి. హుందాగా కనిపించేందుకు ఎక్కువగా గోల్డ్ కలర్ వాటిని కొనుగోలు చేస్తున్నారు. వీటి ధర రూ.400 వరకు ఉన్నాయి. స్టీల్ కప్పులపై తమకిష్టమైన వారి ఫొటోలను ముద్రించుకునేందుకు వీలుంది. వీటి ధర రూ.400గా ఉంది. అలాగే సాదా కప్పుల హ్యాండిల్స్‌పై వివిధ రకాల జంతువుల బొమ్మలు ఉండే ఎనిమల్ కప్పులను చిన్నారులు ఇష్టపడుతున్నారు. వీటి ధర రూ.450గా ఉంది.
 
 వి‘చిత్రం’
 బ్లాక్ కలర్‌లో సాధారణంగా కనిపించే ఈ కప్పుల్లో గొప్ప మ్యాజిక్ ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు దానిపై ఉన్న ఫొటో కనిపించదు. అందులో వేడివేడి టీ, కాఫీ, పాలు తదితరాలు పోసిన వెంటనే దానిపై ముద్రించిన ఫొటోలు దర్శనమిస్తాయి. కప్పు ఖాళీ అయిన తర్వాత, ద్రవ పదార్థం చల్లబడిన వెంటనే చిత్రం మాయం అవుతోంది. దీని ధర రూ.500.
 
 ప్రజలు ఆసక్తి చూపుతున్నారు
 రోజు రోజుకు వినియోగదారుల వీటిపై ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా అనేక రకాల వస్తువులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఫొటోలను ప్రింట్ చేసిన కప్పులు, మ్యాజిక్ టీ కప్పులు ఎక్కువ కొనుగోలు చేసున్నారు. ముఖ్యంగా వీటిపై ముద్రించిన ఫొటోలు, ఇతర చిత్రాలు చిరకాలం మన్నికగా ఉంటుండడంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు.  
 - టీవీ రాజేష్, కిడ్స్ ఎంపోరియం
 

Advertisement
Advertisement