మైనార్టీల జీవితాల్లో ఆర్థిక వెలుగు | Sakshi
Sakshi News home page

మైనార్టీల జీవితాల్లో ఆర్థిక వెలుగు

Published Sun, Jun 7 2020 3:20 AM

CM YS Jagan grants financial support to minorities through various schemes - Sakshi

సాక్షి, అమరావతి: ఏడాది పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మైనారిటీలకు వివిధ పథకాల ద్వారా భారీగా ఆర్థిక సాయం అందించారు. గత చంద్రబాబు సర్కారు రంజాన్‌ తోఫా అంటూ మైనార్టీలను మభ్యపెట్టడానికే ప్రయత్నించింది తప్ప ఇతరత్రా ఏ విధంగానూ ఆదుకోలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా నవరత్నాలతో పాటు ఇతర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను కల్పించి మైనార్టీలను పేదరికం నుంచి బయట పడేలా చేసింది. 

► అసలు మైనార్టీలంటేనే చంద్రబాబుకు చిన్నచూపు. తన మంత్రివర్గంలో ఒక మైనారిటీకి కూడా చోటు కల్పించలేదు. వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. తీరా ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే ఫరూక్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 
► ఇక్కడే గత సర్కారుకు ఈ సర్కారుకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. చంద్రబాబు సర్కారుకు భిన్నంగా జగన్‌ సర్కారు ఏడాదిలోనే మైనార్టీలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంగా నవరత్నాలు, ఇతర పథకాలను అందించింది.
► మైనార్టీ వర్గానికి చెందిన అంజాద్‌ బాషాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఏడాదిలో నవరత్నాల ద్వారా 19.05 లక్షల మంది మైనార్టీలకు రూ.1,722 కోట్ల ఆర్థిక సాయం అందించింది. 
► గత సర్కారులో మైనార్టీలకు బ్యాంకు రుణాలే దిక్కుగా ఉండేవి. అవీ కూడా గత సర్కారులో పెద్దలు తమకు కావాల్సిన వారికి సిఫార్సు చేస్తేనే ప్రభుత్వ సబ్సిడీ విడుదలయ్యేది. వారికే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. 

ఇలా సాధ్యమైంది..
► ఎటువంటి వివక్ష, సిఫార్సులు లేకుండా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా జగన్‌ సర్కారు పని చేసింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలకు అతీతంగా అర్హులైన మైనార్టీలందరినీ వైఎస్సార్‌ నవశకం పేరుతో ఇంటింటి సర్వే ద్వారా వలంటీర్ల ద్వారా గుర్తించింది.
► మంత్రులు, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు జోక్యం లేకపోవడంతో అర్హులైన మైనార్టీలందరికీ ఆర్థిక ప్రయోజనం లభించింది. 
► ఏడాదిలో ఏకంగా 19.05 లక్షల మంది మైనార్టీలకు ఆర్థిక ప్రయోజనం కలగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున మైనార్టీలకు ఆర్థిక సాయం జరగలేదు.
► వైఎస్సార్‌ రైతు భరోసా కింద 60,915 మంది మైనార్టీ రైతులకు రూ.75.86 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద మే నెలాఖరు వరకు 2.28 లక్షల మందికి రూ.564.39 కోట్లు, జగనన్న అమ్మ ఒడి కింద 3.06 లక్షల మంది మైనార్టీ తల్లుల ఖాతాల్లో రూ.459.12 కోట్ల నగదు జమ అయింది. 

Advertisement
Advertisement