మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే | Sakshi
Sakshi News home page

మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే

Published Tue, Mar 24 2020 9:11 PM

CM YS Jagan Review Meeting With Officials On Coronavirus Prevention - Sakshi

సాక్షి, అమరావతి: మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటివరకూ విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారిపైనే కాకుండా ప్రజలందరి మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. మంగళవారం తన నివాసంలో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ ఛైర్మన్‌ సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ స్పెషల్‌ సెక్రటరీ కన్నబాబు పాల్గొన్నారు. (దేశమంతటా 21 రోజులు లాక్‌డౌన్‌)

సమగ్ర సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుంది..
కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించడానికి మరోసారి వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో సర్వే చేయించాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటినీ కూడా సర్వే చేయాలని.. కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే.. సత్వరమే వారికి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. సమగ్ర సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందని.. కోవిడ్‌–19 వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతామని సీఎం తెలిపారు. (లాక్‌డౌన్‌ను పాటించాల్సిందే: డీజీపీ)

పూర్తి సహకారం ఆశిస్తున్నాం..
‘ప్రజలు బయట తిరిగితే.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. అందువల్ల లాక్‌డౌన్‌ను ప్రజలంతా  పాటించాలి. మీరు ఇంట్లో ఉండడం వల్ల వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చేసే సర్వేకు సహకరించిన వారు అవుతారు. రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణకు ప్రజలనుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నామని’  సీఎం పేర్కొన్నారు.

సూచనలు తప్పనిసరిగా పాటించాలి..
రాష్ట్రంలో ఇప్పటి వరకూ పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ కూడా విదేశాలనుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారేనని సీఎం తెలిపారు. సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు. రెండోసారి సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందన్నారు. లక్షణాలు ఉన్నవారు విధిగా హోం ఐసోలేషన్‌ పాటించాలని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement