‘సేవ్ సింగరేణి’ పేరుతో పోరాటం | Sakshi
Sakshi News home page

‘సేవ్ సింగరేణి’ పేరుతో పోరాటం

Published Tue, Jan 14 2014 3:20 AM

Conflict with save singareni name

కోల్‌బెల్ట్, న్యూస్‌లైన్ : సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులలో కోట్ల కుంభకోణం జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు.. కంపెనీని కాపాడుకోవడానికి ‘సేవ్ సింగరేణి’ పేరుతో పోరాటం చేస్తామని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ చెప్పారు. భూపాలపల్లిలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో *200 కోట్ల అవినీతి జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇందులో అధికారుల పాత్ర అధికంగా ఉన్నట్లు బహిర్గతమైనా యాజమాన్యం వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

సకల జనుల సమ్మె కాలంలో సత్తుప ల్లి ఓసీ జీఎం బి-గ్రేడ్ బొగ్గును ఎఫ్-గ్రేడ్‌గా విక్రయించి కాంట్రాక్టర్ వద్ద సుమారు 9 కోట్లు దండుకున్నాడని, ఈ విషయమై యాజమాన్యం విచారణ చేపట్టి ధృవీకరించినా బాధ్యుల పై చర్యలు తీసుకోలేదన్నారు. అదే ఓసీలో ఓబీ పనులు చేయకున్నా అధికారి కాంట్రాక్టర్‌కు 12కోట్లు చెల్లించి పర్సంటేజీలు తీసుకున్నాడని చెప్పారు. ఐదేళ్లక్రితం మేడిపల్లి ఓసీలో 24కోట్ల అవినీతి జరిగిందని, ఏడాది క్రితం అప్పటి ఆర్జీ-1 జీఎం కిషన్‌రావ్ ఎన్‌సీసీ కంపెనీకి 24 కోట్లు అదనంగా చెల్లించి 40 లక్షల కమీషన్ తీసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తమ యూనియన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో 8లక్షలు రికవరీ చేసి కిషన్‌రావ్‌ను బదిలీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

సంస్థలో కోట్లలో అవినీతి జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఏ కార్మికుడికీ చార్జ్‌షీట్ ఇచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కంపెనీలో డిపెండెంట్ హక్కు పునరుద్ధరించాలని, హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 3,600 డిపెండెంట్లను ఒకేసారి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిపై గత నెల 31న సీఎండీ సుతీర్థ భట్టాచార్యకు సమ్మె నోటీస్ ఇచ్చామని, యాజ మాన్యం స్పందించని కారణంగా ఈనెల 25న కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో హెచ్‌ఎంఎస్ నాయకులు ధన్‌రాజ్, ప్రతాప్‌రావ్, రమేష్, బత్తిని సుదర్శన్‌గౌడ్, రాజేశ్వర్‌రా వ్, దాసు, బ్రహ్మచారి, రాంచందర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement