‘తెలంగాణ’ బలవన్మరణాలకు కాంగ్రెస్సే కారణం | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’ బలవన్మరణాలకు కాంగ్రెస్సే కారణం

Published Fri, Aug 16 2013 4:23 AM

congress is the main reason for telangana 's movement deaths

 ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ బిడ్డల బలవన్మరణాలకు కాంగ్రెస్ పార్టీ తీరే కారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నగరంలోని టేకులపల్లికి చెందిన వెంపట రామకృష్ణ కుటుంబీకులను ఆయన గురువారం పరామర్శించారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాదేమోనన్న ఆందోళనతో ఈ నెల 12న సాయంత్రం టేకులపల్లి సమీపంలోని సాగర్ కాలువలో రామకృష్ణ దూకిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆయన మృతదేహం గురువారం కొణిజర్ల మండలంలోని రామనర్సయ్య నగర్ సమీపంలోగల సాగర్ కాల్వలో కనిపించింది.
 
  రామకృష్ణ కుటుంబీకులు, స్థానికులనుద్దేశించి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణపై కాంగ్రెస్ దొంగాట ఆడుతోందని, ఈ కారణంగానే రామకృష్ణ వంటి యువకులు రాష్ట్రం ఏర్పాటు కాదేమోనన్న ఆందోళన, ఆవేదనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా ఒకవైపు సీడబ్ల్యూసీలో తీర్మానం చేసి, దానికి వ్యతిరేకంగా మరోవైపు సీమాంధ్రలో ఉద్యమానికి తెర లేపిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిన పాపం కాంగ్రెసుదేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర సాధనకు సంఘటిత ఉధృతోద్యమమే మార్గమన్న విషయాన్ని యువత గమనంలో ఉంచుకోవాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు. రామకృష్ణ కుటుంబీకులను పరామర్శించిన వారిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంగల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు కొర్లకుంట గోవర్ధన్, కార్యదర్శి నంద్యాల శ్రీను, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోయినేని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

Advertisement
Advertisement