హైదరాబాద్ : న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి శుక్రవారం మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్కు అందచేశారు. తెలంగాణపై కేబినెట్ నోట్ ఆమోదాన్ని నిరసిస్తూ ఏరాసు తన పదవికి రాజీనామ చేశారు. కొద్దిరోజుల క్రితం మంత్రి విశ్వరూప్ కూడా మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఏరాసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందునే రాజీనామా చేసినట్లు తెలిపారు.
కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఏమి చేస్తారా? అని కాంగ్రెస్ అధిష్టానంతో పాటు పార్టీ నాయకులు, ఇతర పార్టీలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయ ప్రకటన తరువాత సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాస్రావు, కాసు కృష్ణారెడ్డి, టిజి వెంకటేష్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ఎమ్మెల్యేలు సిఎం క్యాంపు కార్యాలయంలో కిరణ్తో సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రితో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు.