పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటుకు కృషి | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటుకు కృషి

Published Sun, Dec 21 2014 1:38 AM

Contributed to the creation of the passport center

 నెల్లూరు (సెంట్రల్): నెల్లూరులో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుకు కృషిచేస్తానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ఏర్పాటుచేసిన పాస్‌పోర్టు సేవాక్యాంపు కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటు చేసేంతవరకు రెగ్యులర్‌గా పాస్‌పోర్టు సేవా క్యాంపులను నిర్వహిస్తామన్నారు. నెల్లూరు ప్రజలకు పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి సుష్కాస్వరాజ్‌ను అడిగిన వెంటనే స్పందించి ఈ పాస్‌పోర్టు సేవా క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎంతో మంచివారని, ఆయన కేంద్రంలో మంచి పదవిలో ఉన్నారని ఎంపీ పేర్కొన్నారు. అలాగే జిల్లాను అభివృద్ధి చేయడంలో ముందున్నారన్నారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కూడా జిల్లాకు అడిగిన వెంటనే పనులు చేశారన్నారు. వెంకయ్యనాయుడుతో కలసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. ఏదిఏమైనా జిల్లాపై ఆయన చూపిస్తున్న ప్రేమకు తప్పకుండా కృతజ్ఞతలు తెలపాలన్నారు.
 
 జిల్లాలోని బిట్రగుంట ప్రాంతంలో రైల్వే శాఖకు సంబంధించి 1,500 ఎకరాలు ఉందని, అందులో రైల్వే కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా కృషిచేస్తానన్నారు. కృష్ణపట్నంను ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీపై బడ్జెట్లో ప్రకటించారని, దీని పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా కేంద్రంతో మాట్లాడతానని ఎంపీ పేర్కొన్నారు. సమావేశంలో పాస్‌పోర్టు సేవాక్యాంపు అధికారులు మదన్‌మోహన్‌రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement