ఇంతకుముందు పాత అసెంబ్లీలో కనీసం మైకు ఆన్ అయితే తెలిసేదని, ఇప్పుడు అది కూడా తెలియడం లేదని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అందువల్ల ఇప్పుడు దీనివైపు చూడాలో.. మీవైపు చూడాలో తెలియడం లేదని స్పీకర్తో అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు వెల్లివిరిశాయి. కొత్త పరిజ్ఞానం కారణంగా సెన్సర్లతో కూడిన మైకులు కావడం, వాటి నియంత్రణ మొత్తం స్పీకర్ వద్ద ఉండటంతో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇక ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 50 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారని, కానీ.. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ముష్టి వేసినట్లు 58 కోట్లు, 18.5 కోట్ల చొప్పున ఇస్తూ.. ఇదేదో పెద్ద గొప్పగా చేసినట్లు ప్రకటిస్తున్నారని విమర్శించారు. నిరుపేద కుటుంబాలకు ఇచ్చేది ఇంత చిన్న మొత్తం అయినా.. ఏదో చాలా గొప్పగా చేసినట్లు చెబుతున్నారని అన్నారు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని తెలిపారు. ఇంతకుముందు నెలకు బిల్లు 150 రూపాయలు మాత్రమే వస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక 500 రూపాయల కరెంటు బిల్లులు వస్తున్నాయని చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారన్నారు. ఈ పరిస్థితికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో వైఎస్ఆర్సీపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.