తోడుగా తనువు చాలించారు... | Sakshi
Sakshi News home page

తోడుగా తనువు చాలించారు...

Published Thu, Apr 30 2015 4:14 AM

తోడుగా తనువు చాలించారు... - Sakshi

దంపతుల ఆత్మహత్య
అనారోగ్య కారణాలుగా భావిస్తున్న పోలీసులు

 
పెందుర్తి : కలిసి జీవిద్దామని ఏడడుగులు వేశారు... కష్ట సుఖాల్లో కలిసుందామని మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కానీ విధి చేతిలో ఓడిపోయి తోడుగా తనువు చాలించారు. పెందుర్తి సమీపంలోని దొగ్గవానిపాలెంలో దంపతులు బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య కారణాలే వీరిని ఆత్మహత్యకు పురిగొల్పాయని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండకు చెందిన గరుగు రమేష్ (29), సూర్యకుమారి (25)లకు మూడేళ్ల క్రితం పెళ్లయింది.

జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం పెందుర్తికి వలస వచ్చారు. రమేష్ స్థానికంగా తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. రమేష్ అన్న సురేష్ దంపతులు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూలీ పనులు చేసుకుంటుంటారు. రమేష్ భార్య సూర్యకుమారి ప్రస్తుతం నాలుగో నెల గర్భిణి. వైద్య పరీక్షల నిమిత్తం బుధవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఇంటికి తీసుకువచ్చిన వీరు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ఈ క్రమంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఇద్దరూ ఒకే సారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రమేష్ దంపతులు ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు బలవంతంగా తెరిచారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కొండపల్లి లక్ష్మణమూర్తి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వైద్య రిపోర్టులను బట్టి అనారోగ్య కారణంతోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు సీఐ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement