పుష్కర ఘాట్లను పరిశీలించిన డీజీపీ రాముడు | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్లను పరిశీలించిన డీజీపీ రాముడు

Published Sat, May 21 2016 2:20 AM

పుష్కర ఘాట్లను పరిశీలించిన డీజీపీ రాముడు - Sakshi

తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్లను రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. విజయవాడ నుంచి నేరుగా సీతానగరం ఘాట్ల వద్దకు వచ్చిన ఆయనకు స్థానిక పోలీసు అధికారులు ఘాట్ల అభివృద్ధి ప్రణాళికపై వివరించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్లను 360 మీటర్ల మేరకు మహానాడు రైల్వే వంతెన వరకూ విస్తురిస్తున్నట్లు తెలిపారు. రైల్వే వంతెన దాటాక మరో 100 మీటర్ల ఘాట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు డీఎస్పీ రామాంజనేయులు డీజీపీతో చెప్పారు. డీజీపీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఘాట్లకు వచ్చే రహదారుల ప్రాంతమంతా ఇరుకుగా ఉందని, బ్యారేజీ వద్ద నుంచి ప్రస్తుతం ఉన్న ఘాట్ల వరకూ ర్యాంపు ఏర్పాటు చేసి అదనపు ఘాట్లు నిర్మిస్తే బాగుంటుందన్నారు. ఆయన వెంట ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, అదనపు డీజీలు ఆర్పీ ఠాకూర్, సురేంద్రబాబు, గుప్తా, గుంటూరు రేంజీ ఐజీ సంజయ్, అర్బన్ ఎస్పీ త్రిపాఠి, ఏసీపీ నాగరాజు, మునిసిపల్ కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.


 అమరావతి పుష్కరఘాట్ల పరిశీలన
అమరావతి : అమరావతి పుష్కరఘాట్లను రాష్ట్ర డెరైక్టర్ జనరల్ అఫ్ పోలీస్ జేవీ రాముడు శక్రవారం పరిశీలించారు. ముందుగా ఆయన స్థానిక ధ్యానబుద్ధ వద్ద ఉన్న స్నానఘాట్‌ను, తర్వాత అమరేశ్వరాస్నానఘాట్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పార్కింగ్, ప్రత్యామ్నాయ రోడ్లు, పుష్కరాలకు రోజుకు ఎంతమంది భక్తులు వస్తారు, వారికి కల్పించే సౌకర్యాలు వంటి విషయాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గుంటూరు రేంజి ఐజీ సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టత్రిపాఠి, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు, సీఐ మురళికృష్ణ పాల్గొనగా స్థానిక ఎస్‌ఐ వెంకటప్రసాద్ ఉన్నారు.

Advertisement
Advertisement