2 రాష్ట్రాలా? 4 రాష్ట్రాలా? | Sakshi
Sakshi News home page

2 రాష్ట్రాలా? 4 రాష్ట్రాలా?

Published Wed, Oct 15 2014 3:17 AM

dilemma on brijesh kumar tribunal area

 బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిపై అయోమయం
 నేడు రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్న ట్రిబ్యునల్
 వ్యతిరేకత వ్యక్తం చేయనున్న ఏపీ
 
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధి విషయంలో అయోమయం నెలకొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ట్రిబ్యునల్ గడువును రెండేళ్లపాటు పొడిగించిన విషయం విదితమే. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956 ప్రకారం.. రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయడంతో పాటు కరువు నెలకొన్న సంవత్సరాల్లో అనుసరించడానికి ప్రాజెక్టుల వారీగా ఆపరేషనల్ ప్రొటోకాల్స్ రూపొందించడం ట్రిబ్యునల్ బాధ్యతగా చట్టంలో పేర్కొన్నారు.

అయితే ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాలకు తాజాగా నీటి కేటాయింపులు చేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అఫిడవిట్లు సమర్పించిన విషయం విదితమే. కానీ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకే పరిమితమని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తన తాజా లేఖలో స్పష్టం చేసింది.  కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయంపై బుధవారం జరగనున్న సమావేశంలో ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను ట్రిబ్యునల్ తీసుకోనుంది. ఈ మేరకు అభిప్రాయం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ట్రిబ్యునల్ పరిధి రెండు రాష్ట్రాలకే పరిమితమని పేర్కొనడాన్ని వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చింది.
 
సుప్రీంకోర్టు స్టే సంగతేమిటి?
కృష్ణా జలాల కేటాయింపులపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ట్రిబ్యునల్ తీర్పు అమలు చేయకుండా సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం విదితమే. రాష్ట్ర విభజన తర్వాత.. ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేసి తాజాగా నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అరుుతే సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో.. ఆమల్లోలే ని తీర్పు మేరకు ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయడం సాధ్యమేనా? అనే కోణంలో ట్రిబ్యునల్ ముందు వాదించేందుకు ఏపీ సమాయత్తమవుతోంది.
 
65 శాతం నీటి లభ్యత గురించి తేల్చండి
దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత(డిపెండబిలిటీ) ఆధారంగా నీటి కేటాయింపులు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అప్పట్లో అఖిలపక్షం విజ్ఞప్తి మేరకు ప్రధానమంత్రి కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరంపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ రాలేదు.

దీని ఆధారంగా.. ట్రిబ్యునల్ తీర్పులో కీలకాంశమైన 65 శాతం డిపెండబిలిటీ పై కేంద్రం వైఖరి చెప్పకుండా, ట్రిబ్యునల్ పరిధి విషయంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సొంత వ్యాఖ్యానం చెబుతూ రెండు రాష్ట్రాలకే పరిమితమని పేర్కొనడాన్ని వ్యతిరేకించాలనే నిర్ణయానికి రాష్ట్రం వచ్చింది. మెుత్తం మీద రెండు రాష్ట్రాలకే పరిమితమంటూ కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ట్రిబ్యునల్‌కు లేదని, అందరి వాదనల విన్న తర్వాత నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement