స్వైన్‌ఫ్లూపై ఆందోళన వద్దు | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూపై ఆందోళన వద్దు

Published Sun, Oct 20 2013 4:03 AM

Do not worry swine flu

కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటం వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇందుకు సరిపడా చికిత్సను అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గిరిజాశంకర్ వెల్లడించారు. శని వారం తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో ఈనెల 2న గాం ధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని, ఈ వేడుకలకు హైదరాబాద్‌కు చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు వచ్చారని తెలిపారు. అందులో ఒకరికి స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలుండటంతో, వారి నుంచి ఆనంద్ అనే వ్యక్తికి సంక్రమించిం దన్నారు.
 
 ఇదే విషయం తమ విచారణలో వెల్లడైందని చెప్పా రు. వ్యాధి లక్షణాలున్న విషయాన్ని ఆనంద్ వెంటనే సమాచారం ఇచ్చి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఆనంద్ తండ్రి రాంచంద్రయ్యకు స్వైన్ ఫ్లూ రావడంతో ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించి, ప్రత్యేక వార్డులు చికిత్స అందిస్తున్నామన్నారు. తూడుకుర్తిలో 14 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటిని నాలుగుసార్లు తనిఖీ చేసి గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని, ఇంకెవ్వరికి వ్యాధి లక్షణాల్లేవని తేలిందన్నారు. స్వైన్‌ఫ్లూకు జిల్లాలోనే వైద్యం అందిస్తున్నామని, ఇందుకు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి రాకుండా ఆపలేం కానీ, వచ్చిన వ్యాధిని ఇతరులకు సంక్రమించకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటి స్తే సరిపోతోందన్నారు. జిల్లా ఆస్పత్రిలో 20 బెడ్లతో కూడిన ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని, అవసరమైతే ఇంకో 20బెడ్లను అదనంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ చెప్పారు. తూడుకుర్తితో పాటు, ఇతర గ్రామాల్లో ఈవ్యాధి సోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే దగ్గర్లో ఉన్నా పీహెచ్‌సీలను సంప్రదించి చికిత్స పొందుకోవాలని, ఏమైనా ఎక్కువైతే వెంటనే జిల్లా ఆస్పత్రికి రావాల్సిందిగా సూచించారు.
 
 నాటు వైద్యాన్ని ప్రొత్సహించేది లేదు
 జిల్లాలో చెంచుపెంట వాసులంతా నాటు వైద్యాన్ని సంప్రదించకుండా, ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నాటు వైద్యాన్ని ప్రొత్సహించేది లేదన్నారు. చిన్న వైద్యానికి పెద్ద చికిత్సలు చేసిన  ఆర్‌ఎంపీలకు ఇటీవల నోటీసులు జారీ చేశామని, వారి నుంచి సమాధానం రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి, ప్రాణం పోయ్యేలా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.రుక్మిణి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామ్యూల్ పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement