చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం | Sakshi
Sakshi News home page

చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం

Published Mon, Mar 19 2018 8:33 AM

Donors Came Forward For Children Treatment - Sakshi

సామర్లకోట (పెద్దాపురం) : స్థానిక మెహర్‌ కాంప్లెక్స్‌లో ఊపిరితిత్తుల వ్యాధితో  బాధపడుతున్న అమర్తి దుర్గాప్రసాద్‌ (7), లక్ష్మి (4) మార్త (2)ను  ఆదుకోవడానికి అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు. అమర్తి వెంకట్, చిన్న దంపతులకు జన్మించిన ఈ ముగ్గురు పిల్లలు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. వారి పరిస్థితిపై ‘ దాతలే వీరిని ఆదుకోవాలి’ అనే శీర్షికతో ఫిబ్రవరి 2వ తేదీన సాక్షి దినపత్రికలో కథనం ప్రచురతమైంది. దాన్ని చదివిన అనేక మంది సాయం చేస్తున్నారు.

దానిలో భాగంగా ఆదివారం కాకినాడకు చెందిన సమాఖ్య చారిటబుల్‌ సొసైటీ నుంచి రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని ఆ సంస్థ ప్రతినిధి అచ్యుత్‌.. పిల్లల తల్లిదండ్రులకు అందజేశారు. ఒక్కొక్క చిన్నారికి ఆపరేషన్‌కు రూ.30 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం సరిపోక.. దాతల కోసం సాక్షి దినపత్రికను తల్లిదండ్రులు ఆశ్రయించారు. కనీసం ఒక పిల్లవాడినైనా దక్కించుకోవాలనే ఆశతో ఉన్నామని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.4.60 లక్షలు ఆర్థికసాయం అందిందని వెంకట్‌ ‘సాక్షి’కి తెలిపారు. కాకినాడకు చెందిన కె.మహేష్‌ అనే విద్యార్థి విశాఖపట్నంలో చదువుకుంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని వెబ్‌ న్యూస్‌లో చదివి సమాఖ్య చారిటబుల్‌ ట్రస్టుకు తెలియజేశారని, దాంతో సంస్థ సభ్యులు విచారణ చేసి ఆదివారం ఈ సాయం అందించారన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement