పోలీసుల అదుపులో డీఎస్పీ కుమారుడు | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో డీఎస్పీ కుమారుడు

Published Fri, Mar 7 2014 8:47 AM

DSP's son questioned over theft of car from Hyderabad hotel

ఖరీదైన వాహనం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఓ డీఎస్పీ కుమారుడితో సహా నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిందితుడు ఎవరనే కోణంలో సాంకేతికంగా దర్యాప్తు చేస్తూ విచారిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.80లో నివసించే ఎన్‌వీవీ ప్రసాద్ గతేడాది మే 22న జూబ్లీహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్‌కు వచ్చారు. తన స్కోడా సూపర్బ్ కారును హోటల్‌కు చెందిన వ్యాలెట్ పార్కింగ్‌లో ఉంచారు. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆయన కారు చోరీ అయిందని గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

కేసు నమోదు చేసుకున్న అధికారులు కారు విలువ భారీగా ఉండటంతో దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు హోటల్ ప్రధాన ద్వారం, ఇతర ప్రాంతాలతో పాటు పార్కింగ్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. ప్రాథమికంగా నలుగురిని అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్న ఓ డీఎస్పీ కుమారుడు కూడా ఉన్నారు. ‘ఆ నలుగురిలో అసలు నిందితుడు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నాం. దీనికోసం అనుమానితుల్ని విచారించడంతో పాటు ఫోన్ వ్యవహారాలకు సంబంధించి సాంకేతికంగానూ ముందుకు వెళ్తున్నాం. వాహనం రికవరీ కోసమూ ప్రయత్నిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
 

Advertisement
Advertisement