ఎన్నికలు ప్రశాంతం | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ప్రశాంతం

Published Sun, Jan 19 2014 3:40 AM

elections calm

కాగజ్‌నగర్ రూరల్/దండేపల్లి/    బెజ్జూర్/తాండూర్, న్యూస్‌లైన్ :  జిల్లాలో వాయిదా పడ్డ సర్పంచ్, వార్డుల స్థానాలకు శనివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగజ్‌నగర్‌లోని నజ్రూల్‌నగర్ పంచాయతీకి  సర్పంచ్ స్థానానికి నిర్వహించిన ఎన్నికలో టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి బిజయ్‌ఘరామీ విజయం సాధించారు. నజ్రూల్‌నగర్ విలేజ్ నంబర్ 12లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 16 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయంగా కేటాయించడంతో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మొత్తం 7,229 ఓట్లకు గాను 4,935 ఓట్లు పోలయ్యాయి. 69.30 శాతంగా పోలింగ్ నమోదైంది. బిజయ్‌ఘరామీకి పోటీగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గం బలపర్చిన స్వప్నమల్లిక్, శివానీబరాయ్ బరిలో నిలిచారు. వీరిలో బిజయ్‌ఘరామీకి 3,153 ఓట్లు పోలవ్వగా.. స్వప్నమల్లిక్‌కు 1,634, శివానీబరాయ్‌కి 88 ఓట్లు వచ్చాయి.
 
 60 ఓట్లు చెల్లనివిగా తీరస్కరించబడ్డాయి. దీంతో బిజయ్‌ఘరామీ 1519 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజమౌళి ప్రకటించారు. ఇందు లో డీఎల్‌పీవో శ్రీనివాసరెడ్డి, ఈవోపీఆర్డీ క్రిష్ణమూర్తి, మోడల్ కోడ్ జోనల్ అధికారి నీలం సంపత్‌కుమార్ పాల్గొన్నారు. తదుపరి సర్పంచ్‌గా గెలుపొందిన బిజ య్‌ఘరామీతో ఆయన మద్దతుదారులు, ఆయా పార్టీ ల నాయకులు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ తీశా రు.
 
 ఇందులో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రావి శ్రీనివా స్, నాయకులు పాల్గొన్నారు. కాగా.. ఎన్నికల సిబ్బం దికి భోజన వసతి కల్పించకపోవడంతో వారు ఎంపీడీవో సత్యనారాయణసింగ్ ను నిలదీశారు. భోజనం చేసే వరకూ కౌంటింగ్ ప్రా రంభించేది లేదని తేల్చడం తో సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా కౌంటింగ్ ఆరంభమైంది. ఎన్నికల సందర్భంగా డీఎస్పీ సురేష్‌బాబు ఆధ్వర్యంలో సీఐలు రహమాన్, సత్యనారాయణ, ఎస్సైలు సురేందర్, సత్యనారాయణతోపాటు మరో 60 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
 
 వార్డు సభ్యుల ఎన్నిక
 దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో రెండో వార్డు స్థానానికి నిర్వహించిన ఎన్నికలో 168 ఓట్లకు గాను 152 పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్ బలపర్చిన కంది రవి 45 ఓట్ల మెజార్టీతో వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ముగ్గురు బరిలో ఉండగా రవి విజయం సాధించారు.  రిటర్నింగ్ అధికారి, ఈవోపీఆర్డీ శివకృష్ణ, సిబ్బంది  చంద్రమౌళి, సుభాశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
 
 ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో బం దోబస్తు నిర్వహించారు. ఎన్నిక అనంతరం రవి, ఆయన మద్దతుదారులు గ్రామంలో విజయోత్సవ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ గడ్డం శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రేణి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. అలాగే బెజ్జూర్ మండలం సోమిని పంచాయతీ పరిధి తొమ్మిదో వార్డుకు నిర్వహించిన ఎన్నికలలో 97 ఓట్లకు 76 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలువగా.. ఆరెపెల్లి లహన్ విజయం సాధించినట్లు ప్రొసిడింగ్ అధికారి వల్వీనాయక్ ప్రకటించారు. తన సమీప ప్రత్యర్థి జ్యోత్స్నకు 18 ఒట్లు రాగా లహన్‌కు 48 ఓట్లు వచ్చా యి. 30 ఓట్ల మెజార్టీతో లహన్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎస్సై కుమారస్వామి భారీ బందోబస్తు నిర్వహించారు. అలాగే తాండూర్ మండలం అచ్చలాపూర్ రెండో వార్డుకు నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గుర్రం లింగయ్య గెలుపొందారు. 182 ఓట్లకు గాను 160 పోలయ్యాయి. మూడు చెల్లకుండా పోయాయి. ఇందులో లింగయ్య 83 ఓట్లు రాగా.. సీపీఐ బలపర్చిన సమీప ప్రత్యర్థి అట్టి రాములు 74 ఓట్లు వచ్చాయి. కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతో లింగయ్య గట్టెక్కాడు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మారుతికుమార్, ప్రిసైడింగ్ అధికారి బాలాజీప్రసాద్ గుర్రం లింగయ్యకు నియామకపు పత్రం అందజేశారు.
 

Advertisement
Advertisement