6లోగా ఆన్‌లైన్‌లో ఉద్యోగుల వివరాలను పొందుపరచాలి | Sakshi
Sakshi News home page

6లోగా ఆన్‌లైన్‌లో ఉద్యోగుల వివరాలను పొందుపరచాలి

Published Fri, Dec 20 2013 4:15 AM

Employees details put in online

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను వచ్చే ఏడాది జనవరి 6వ తేదీలోగా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి బీవీ రమేశ్ కలెక్టర్‌ను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఓ నంబరు 334 ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలన్నారు.
 
 వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు జీవో 334కు సంబంధించి పూర్తి వివరాలను  నిర్ణీత సమయంలోగా ఆన్‌లైన్లో పొందుపర్చాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఈ నెల 24లోగా స్వీకరించాలని అందులో ఏమైన తప్పులు ఉంటే సరిచేసి జనవరి 6వ తేదీ నాటికి వెబ్‌సైట్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల డీడీవోలు అటెస్టేషన్ చేసి వేతనం బిల్లులతో పాటు పంపించాలన్నారు.
 
  వెబ్‌సైట్‌లో పొందుపరచని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్, జెడ్పీ సీఈవో ఆశీర్వాదం, ఇన్‌చార్జి డీఆర్వో సాయిలుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement