నిజాయితీకి నిదర్శనం దామోదరం.. | Sakshi
Sakshi News home page

నిజాయితీకి నిదర్శనం దామోదరం..

Published Sun, Feb 15 2015 3:26 AM

evidence of honesty ..

కర్నూలు(అర్బన్):  నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నిలిచారని శాసనమండలి చైర్మన్  చక్రపాణియాదవ్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా కర్నూలులో శనివారం  దామోదరం జయం తి  వేడుకలను నిర్వహించింది. కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, వై. ఐజయ్య, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రామస్వామి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ కేక్ కట్ చేసి ప్రసంగించారు. దామోదరాన్ని  యువత, రాజకీయ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా కార్మికులకు బోనస్ ప్రకటించి బోనస్ సంజీవయ్యగా కార్మికుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు. భూ సంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చి 6 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేయించారని చెప్పారు.
 
 బీసీ వసతి గృహాన్ని దత్తత తీసుకుంటా
 దామోదరం సంజీవయ్యను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పిలుపునిచ్చారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉంటే ఎంతో మంది నిరుపేదలకు సేవ చేయవచ్చన్నారు. దామోదరం స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. జిల్లాలోని ఒక ప్రభుత్వ బీసీ వసతి గహాన్ని దత్తత తీసుకొని దానిని ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు.
 
 పెద్దపాడును దత్తత తీసుకుంటా:
 దామోదరం సంజీవయ్య స్వగ్రామమైన పెద్దపాడును  తాను దత్తత తీసుకుంటానని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు.  అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ఎస్‌సీ,ఎస్‌టీ,బీసీ సంఘాల నాయకులు దామోదరం రంగయ్య, టి షడ్రక్, వాడాల త్యాగరాజు, డీపీ స్వామన్న, జి నాగరాజు, ఎం స్వామి, వై జయరాజు, టి చిన్న లక్ష్మన్న, చిటికెల సలోమి, బాలసుందరం, వేల్పుల జ్యోతి, గడ్డం రామక్రిష్ణ, అనంతరత్నం మాదిగ, టి శేషఫణి, కైలాస్‌నాయక్, జే బాబురాజు, వెంకటేష్, టీపీ శీలన్న, లింగస్వామి, రాజ్‌కుమార్, పుల్లన్న తదితరులు ప్రసంగించారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఆర్డీఓ రఘుబాబు, ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, డీఎంహెచ్‌వో నిరుపమ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పులిచేరి సారయ్య, డీఈవో సుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement