ప్రచార గారడి | Sakshi
Sakshi News home page

ప్రచార గారడి

Published Sat, Nov 9 2013 4:01 AM

excellent wonders are happening witches are proveing...

ఉదయగిరి, న్యూస్‌లైన్:  శూన్యంలో నుంచి అద్భుతాలు సృష్టిస్తామని మభ్యపెట్టడంలో మన పాలకులు మాంత్రికులను మించిపోతున్నారు. ఏమీ చేయకుండానే అది చేశాం.. ఇది చేశామంటూ గొప్పలు ప్రచారం చే స్తున్నారు. సంక్షేమ పథకాల అమలును నెలల తరబడి నిలిపేసి ప్రచార వేదికల కోసం ఆరాటపడుతున్నారు. మూడు నెలల క్రితం మంజూరైన అరకొర పింఛన్లను రచ్చబండలో ఆర్భాటంగా పంపిణీ చేసేందుకు వాయిదా వేశారు.
 
  మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను తూ.చ.తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆది నుంచి మా ట తప్పుతూనే ఉన్నారు. ఏడాదిన్నర క్రితం నిర్వహించిన రచ్చబండ సందర్భంలో ఆయన చెప్పిన గొప్పలకు తమ కష్టాలు తీరిపోతాయని ప్రజలు భ్రమపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా పింఛన్ల పంపిణీ మంజూరు కాలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీని తెరపైకి తెచ్చారు. జూలైలో కేవలం 30 వేల మందికే మంజూరు చేశారు. అయినా కొంత మంది కైనా లబ్ధి చేకూరుతుందని ప్రజలు సర్దుకుంటే.. ఇప్పటి వరకు వాటి  పంపిణీ చేపట్టలేదు. త్వరలో జరగనున్న రచ్చబండలో వాటిని ఆర్భాటంగా పంపిణీ చేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు.  
 
 అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ
 కొత్తగా పింఛన్ మంజూరైన వారి కష్టాలు ఇలా ఉంటే, ఇప్పటికే పొందుతున్న వారి బాధలు మరోలా ఉన్నాయి. మహానేత వైఎస్సార్ హయాంలో ప్రతి నెలా 1వ తేదీన టంఛన్‌గా పింఛన్ పొందారు. ఆదివారమైనా, సెలవైనా, పండగైనా పింఛన్ల పంపిణీ మాత్రం కొనసాగేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదో తేదీ వస్తున్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇంకా పింఛన్ అందలేదు. నిత్యం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు పింఛన్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే మూడు నెలలకోసారి పింఛన్ పంపిణీ జరుగుతుండటం మన పాలకుల తీరుకు నిదర్శనం.
 

Advertisement
Advertisement