ప్రజాపోరుకు సమాయత్తం | Sakshi
Sakshi News home page

ప్రజాపోరుకు సమాయత్తం

Published Thu, Dec 4 2014 12:31 AM

ప్రజాపోరుకు సమాయత్తం - Sakshi

{పభుత్వ వైఫల్యాలపై సమరశంఖం పూరించనున్న వై.ఎస్.జగన్
5న ధర్నాకు కార్యాచరణ వేగవంతం
కదలిరానున్న వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు
భారీగా పాల్గొననున్న రైతులు, మహిళలు

 
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రజాగ్రహభేరి మోగనుంది. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన ప్రభుత్వ పెద్దలపై ప్రజాపోరాటానికి విశాఖపట్నం వేదికగా నిలవనుంది. హామీల మాయాజాలనికి మోసపోయామంటూ ప్రజానీకం  మహాధర్నాకు సమాయత్తమవుతోంది. వీరి పక్షాన ఈ నెల 5న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు మహాధర్నా తరలిరానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులన్నీ  కలెక్టరేట్ ప్రాంగణానికే చేరుకునేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలవారీగా సన్నాహక సమావేశాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా రైతులు, మహిళల పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తదితరులు బుధవారం కూడా విసృ్తత సమావేశాలు నిర్వహించారు.

తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సమన్వయకర్త వంశృకృష్ణ శ్రీనివాస్ బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి గుడివాడ అమర్, రఘురాం హాజరయ్యారు. నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. పశ్చిమ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్ సమావేశమయ్యారు. గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈ సమావేశంలో ప్రసంగిస్తూ ధర్నాను విజయవంతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో సమన్వయకర్త తైనాల విజయ్‌కుమార్ సమావేశమయ్యారు. గాజువాకలో సమన్వయకర్త తిప్పల  నాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విసృ్లతంగా పర్యటించారు. భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మధురవాడ, యండాడ తదితర నగర  శివారు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు బుధవారం నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తదితరులు నేతలు, కార్యకర్తలతో బుధవారం రాత్రి మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధర్నా ఏర్పాట్లను సమీక్షించారు. నగరంలో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన  ఈ సమావేశాల్లో రాష్ట్ర కార్యదర్శి కంపా హనోక్, కొయ్య ప్రసాదరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, పక్కి దివాకర్, రవిరెడ్డి తదితరులు హాజరు ధర్నా నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రూరల్ జిల్లాలో సమరోత్సాహం

రూరల్ జిల్లా పరిధిలో కూడా మహాధర్నాకు సన్నాహకాలను వేగవంతం చేశాయి. ఒక్క రోజే సమయం ఉన్నందున నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు తమ నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలతో సమావేశమై విశాఖపట్నం ధర్నాకు భారీగా కార్యకర్తలు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు.  జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే చెంగాల వెంకట్రావు పాయకరావుపేట నియోజవర్గంలో పర్యటించి ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ పలు మండలాలోల విసృ్తతంగా పర్యటించారు. చోడవరం, నర్సీపట్నం సమన్వయకర్తలు ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్‌లు తమ నియోజవర్గాల్లో పర్యటించి సన్నాహకాలను వేగవంతం చేశారు. యలమంచిలి సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు బుధవారం ధర్నా ఏర్పాట్లను సమీక్షించారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వం వైఫల్యాలపై పోరుబాటకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ధర్నాను విజయవంతం చేయడం ద్వారా ప్రజావాణిని బలంగా వినిపించేందుకు సమాయత్తమవుతున్నాయి.
 

Advertisement
Advertisement