ప్రత్యేక హోదా సాధనకు సమష్టి పోరు | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా సాధనకు సమష్టి పోరు

Published Thu, Aug 20 2015 3:46 AM

ప్రత్యేక హోదా సాధనకు సమష్టి పోరు - Sakshi

కర్నూలు(ఓల్డ్‌సిటీ) : సమష్టి పోరాటంతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిద్దామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు పునర్విభజన ప్రయోజనాలన్నీ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రస్తుతం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ఆ హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలు.. హోదా రాకపోతే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలకు అర్థమైతే.. ఉద్యమాలను వారే నిర్వహిస్తారన్నారు. వారికి వైఎస్‌ఆర్‌సీపీ అండగా నిలుస్తుందన్నారు. ప్యాకేజీ పేరిట కేంద్రం.. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని.. ప్యాకేజీతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి.. నందికొట్కూరు, డోన్, ఆలూరు ఎమ్మెల్యేలు ఐజయ్య, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో మునికోటి ప్రాణ త్యాగం చేశారని, హోదా సాధించే వరకు ప్రజలు పోరాటం సాగించాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు హఫీజ్‌ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, న్యాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.రాకేశ్‌రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.అబ్దుల్హ్మ్రాన్, జాయింట్ సెక్రటరీ బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులు పర్ల శ్రీధర్‌రెడ్డి, పి.తిరుమలేశ్వరరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎ.నారాయణమ్మ, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎం.ఎ.హమీద్ పాల్గొన్నారు.
 
 బంద్‌కు ప్రజలు సహకరించాలి -  బుడ్డా రాజశేఖరరెడ్డి
  ప్రత్యేక హోదా సాధించుకోవడం రాష్ట్ర ప్రజల హక్కు అని బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఈనెల 10న తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిచ్చారన్నారు. అదేవిధంగా ఈనెల 29న తమ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని.. ప్రజలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, అభిమానులు సహకరించాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement