Sakshi News home page

మద్యం కంపెనీలకు మేలు

Published Wed, Mar 6 2019 4:06 AM

Financial burden Downward On alcohol manufacturing companies - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు ప్రయోజనం కలిగిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మద్యం తయారీ కంపెనీల దగ్గరే ఎక్సెజ్‌ డ్యూటీని వసూలు చేస్తున్నారు. ఆ తరువాత సేల్‌ పాయింట్, రిటైలర్‌ సరుకు తీసుకున్నప్పుడు ఎక్సైజ్‌ డ్యూటీని వసూలు చేసి తిరిగి మద్యం తయారీ కంపెనీలకు చెల్లించేవారు. అయితే ఇప్పుడు మద్యం తయారీ కంపెనీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ఎక్సైజ్‌ చట్టంలో నిబంధనలను మార్చాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
- గత కేబినెట్‌ సమావేశంలో రాజధానిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కేటాయించిన 30 ఎకరాలను రద్దు చేశారు. దాని స్థానే 15 ఎకరాలను కేటాయిస్తూ అందులో అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం. అలాగే తిరుపతి, విజయవాడ జర్నలిస్టులకు పట్టణ పేదల పథకం కింద టిడ్కో ద్వారా అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌.
ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ సంక్షేమానికి రూ.10 కోట్ల కార్పస్‌ నిధితో కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు
స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఏపీ మినరల్‌ ఎక్స్‌ఫ్లొరేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు.  
అనంతపురం జిల్లా ముతువకుంటగ్రామంలో పది మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో కూడిన 160 మెగావాట్ల విండ్‌ సోలార్‌ హైబ్రీడ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు 75.25 ఎకరాల భూమి మార్కెట్‌ ధరకు కేటాయింపు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఉరిచింతలలో 50.95 ఎకరాలు, వెలమకూరులో 2.99 ఎకరాలు పవన విద్యుత్‌ కేంద్రాలకు కేటాయింపు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో 5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుకు లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ ఇవ్వడానికి నిర్ణయం.
అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పథకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులను గ్రూప్‌–2 పోస్టుల్లో నియమించాలని నిర్ణయం. ఇందులో రాగల వెంకట రాహుల్‌ (వెయిట్‌ లిఫ్టర్‌), బుడ్డారెడ్డి అరుణ (జిమ్నాస్టిక్‌), ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ టీమ్‌ కెప్టెన్‌ జఫ్రీన్‌ ఉన్నారు. 
గత ఏడాది సౌతాఫ్రికాలో జరిగిన వరల్డ్‌ జూనియర్‌ అండ్‌ సబ్‌ జూనియర్‌ ఉమెన్స్‌ ఛాంపియన్‌షిప్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో సిల్వర్‌ మెడల్‌ సాధించిన డి.అనూషకు పది లక్షలు, గోల్డెన్‌ డిస్క్‌ అవార్డ్‌ విన్నర్, యంగ్‌ ఆర్చర్‌ డాలీ శివానీకి రూ.25 లక్షలు, అంతర్జాతీయ యోగా ఛాంపియన్‌ ఏకాంబరం జోష్ణవికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయం.
విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు, సీఆర్‌డీఏ పరిధిలో ఉద్యోగులకు బస్‌పాస్‌ రాయితీ కొనసాగించాలని నిర్ణయం.  
ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు రూ.42,80,477లతో పాటు, విశాఖ దీక్షకు రూ.5,08,498, అనంతపురం దీక్షకు రూ.8,32,000లు వ్యయానికి ఆమోదం. ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులకు ఐదు రోజులు ఆన్‌ డ్యూటీగా పరిగణింపు.  
- రాష్ట్రంలో సింగిల్, డబుల్, ట్రిబుల్‌ యూనిట్‌ అగ్నిమాపక కేంద్రాల్లోని 204 ఫైర్‌మెన్‌ పోస్టులు ఉన్నతీకరణ.
-రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు తిరిగి రీ ఎంప్లాయిమెంట్‌ పొందిన ఎల్‌ ప్రేమచంద్రారెడ్డి, ఎస్‌. బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, డి.చక్రపాణి, అశుతోష్‌ మిశ్రాకు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు.  
విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, నెల్లూరులో డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్ర నిర్మాణాలకు మున్సిపల్‌ టాక్స్‌ నుంచి 75 శాతం మినహాయింపు
విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు జీతభత్యాలతో పాటు పెన్షన్లు కూడా ట్రెజరీ ద్వారా చెల్లింపు.
విశాఖపట్నం జిల్లా మధురవాడ గ్రామంలో ఐదు ఎకరాల స్థలాన్ని ఫిలింనగర్‌ కల్చరల్‌ సొసైటీ కేంద్రానికి ఎకరానికి రెండు లక్షలు చొప్పున అద్దెకు ఇవ్వాలని నిర్ణయం.
- చండ్ర రాజ్వేరరావు ఫౌండేషన్‌కు సీఆర్‌డీఏ పరిధిలో మూడు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం.
బైరైటీస్‌ గనుల ముడి పదార్ధాల ప్రాసెసింగ్, రసాయనిక యూనిట్ల ఒప్పందం మేరకు మొత్తం పరిమాణంలో 50 శాతం లక్ష్యాన్ని సాధించకపోతే ఐదు శాతం అపరాధ రుసుము విధించేందుకు ఆమోదం. 
తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని కేబినేట్‌ సమావేశంలో నిర్ణయం.  

Advertisement

What’s your opinion

Advertisement