ప్రేమికుడి కోసం యువతి చోరీలు | Sakshi
Sakshi News home page

ప్రేమికుడి కోసం యువతి చోరీలు

Published Thu, Jan 22 2015 1:32 AM

ప్రేమికుడి కోసం యువతి చోరీలు

విజయవాడ సిటీ : ప్రేమికుడితో కలిసి జల్సాల కోసం చోరీలను వృత్తిగా ఎంచుకున్న యువతిని సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చోరీ చేసి తెచ్చిన సొత్తును విక్రయించిన యువకుడిని కూడా అరెస్టు చేసి రూ.4లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ కార్యాలయంలో బుధవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. పాయకాపురం శాంతినగర్‌కు చెందిన నూకల దుర్గాభవాని డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపివేసింది.

మూడేళ్ల కిందట ఇబ్రహీంపట్నానికి చెందిన నిరుద్యోగి దాసరి కృష్ణంరాజు పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. కృష్ణంరాజు అవసరాల కోసం దుర్గాభవాని సిటీబస్సుల్లో చోరీలు చేయడం ప్రారంభించింది. తద్వారా వచ్చిన సొమ్ముతో ఇద్దరూ జల్సా చేసేవారు. గత రెండేళ్లుగా  నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆమె 16 చోరీలకు పాల్పడింది. వీటిలో కొందరు బాధితుల ఫిర్యాదు మేరకు ఏడు కేసులు నమోదయ్యాయి.

ఇలా చిక్కారు

గత కొంత కాలంగా సిటీ బస్సుల్లో జరుగుతున్న చోరీలపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు. ఎస్‌ఐ బి.కృష్ణకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. మంగళవారం ఈ బృందం గవర్నరుపేటలోని ఓ థియేటర్ వద్ద ఉండగా కృష్ణంరాజు అనుమానాస్పద స్థితిలో తారసపడ్డాడు. చోరీ సొత్తును విక్రయించేందుకు వచ్చిన ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని   తమదైన శైలిలో విచారణ జరపగా విషయం వెలుగు చూసిం ది. ఈ మేరకు ఇద్దరినీ అరెస్టు చేసి చోరీసొత్తు స్వాధీ నం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో క్రైం ఏసీపీలు  వర్మ, గుణ్ణం రామకృష్ణ, పి.సుందరరాజు, సీసీఎస్ సీఐ కృష్ణంరాజు పాల్గొన్నారు.
 
దోపిడీ దొంగల అరెస్టు

సొమ్ము కోసం దోపిడీలు చేస్తున్న నలుగురు యువకులను బుధవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు బైక్‌లు, రూ.1,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.అదనపు డిసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి, బండారు సాయి కళ్యాణ్, తాడేపల్లి నవీన్, మర్రి సాయికిరణ్ స్నేహితులు. వీరు మద్యం మత్తులో వంటరిగా వెళ్లే వారిపై దాడులు చేసి మోటారు సైకిళ్లు, నగదు, మొబైల్ ఫోన్లు దోచుకుంటారు. ఈ తరహా నేరాలపై సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణంరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందం నిఘా పెట్టి ఈ నలుగురినీ నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
 కారు దొంగ అరెస్టు
 ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు దొంగిలించిన పాత నేరస్తుణ్ణి బుధవారం సీసీఎస్ పోలీసులు అరె స్టు చేశారు. అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు కథనం ప్రకారం.. నగరంలోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌లో పనిచేసే దారెల్లి అనిల్‌కుమార్ ఈ నెల 12న తన కారును అజిత్‌సింగ్‌నగర్ బాలభవన్ సమీపంలోని తన ఇంటి ముందు నిలిపి ఉంచాడు. మరుసటి రోజు చూసుకుంటే కారు కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ కాలేజీ సమీపంలో వదిలేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లభ్యమైన వేలి ముద్రల ఆధారంగా బుడమేరు మధ్య కట్ట ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడైన ముద్రబోయిన ప్రభుకుమార్‌ను అరెస్టు చేశారు. అందులో నుంచి దొంగిలించిన మ్యూజిక్‌ప్లేయర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
 జల్సారాయుళ్ల అరెస్టు
 వ్యసనాలు తీర్చుకునేందుకు అవసరమైన సొమ్ము కోసం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో సభ్యుడైన బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.30వేల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డిసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం..అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన బలిసాని తిరుపతిరావు, వడియార్ గణేష్, మరో 16 ఏళ్ల బాలుడు స్నేహితులు. తిరుపతిరావు చిన్నప్పుడే వ్యసనాలకు బానిసై చోరీలకు అలవాటు పడ్డాడు. స్నేహితులను కలుపుకుని ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నెల 17న ప్రసాదంపాడులో ఇదే తరహా చోరీ చేశారు. వరుస చోరీలపై సీసీఎస్ ఎస్‌ఐ కృష్ణకుమార్ బృందం నిఘా పెట్టగా ఏలూరు లాకుల సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement