ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పారని.. | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పారని..

Published Tue, Jun 3 2014 12:36 PM

ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పారని.. - Sakshi

*ఇద్దరిపై గాజు పెంకులతో బాలుడి స్నేహితుల దాడి..
*ఒకరికి చాతిపై, మరొకరికి పొట్టపై గాయాలు
 
విజయవాడ : తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పారనే కోపంతో ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి ఇద్దరు యువకులపై గాజు పెంకులతో దాడిచేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కథనం ప్రకారం... సత్యానారాయణపురం బుడమేరు మధ్యకట్టపై నివసించే బాలుడు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన పాపారావు, రామారావు అనే యువకులు చూశారు. ఈ విషయాన్ని వెంటనే వారు ఆ బాలుడి బాబాయికి తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని మందలించారు.

ఈ విషయం తెలుసుకున్న బాలుడి స్నేహితులు వెంటనే పాపారావు, రామారావులతో  గొడవకు దిగారు. వివాదం కాస్తా శ్రుతిమించటంతో బాలుడి స్నేహితుడు ఒకరు గ్రౌండ్‌లో దొరికిన గాజు పెంకుతో పాపారావు పొట్టపైన, రామారావు మెడపైనా దాడిచేశాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో నలుగురు... తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉన్నారు. దీంతో ఈ వయసులో ప్రేమ పేరుతో గొడవలకు దిగడంపై పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement