జనవరి నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ | Sakshi
Sakshi News home page

జనవరి నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ

Published Fri, Nov 21 2014 3:28 AM

జనవరి నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ

కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే ఏడాది జనవరి 1 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నామని.. డీలర్లు గ్యాస్ కనెక్షన్లను ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ కన్నబాబు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఈనెల 15 నుంచి రాష్ట్రంలోని 9 జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చిందన్నారు. ఇందులో కర్నూలు జిల్లా లేదని.. వచ్చే జనవరి నుంచి జిల్లాలోనూ అమలు చేస్తున్నందున డీలర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

జిల్లాలో 5,88,379 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 548920 కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయన్నారు. బ్యాంకు ఖాతాలు మాత్రం 3,36,127 కనెక్షన్లకే అనుసంధానం చేశారని.. ముఖ్యంగా వినియోగదారుల నుంచి బ్యాంకు ఖాతాలు సేకరించి అనుసంధానం చేయడంపై దృష్టి సారించాలన్నారు. వినియోగదారులను కూడా చైతన్య పరచి ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఇవ్వకపోతే జరిగే నష్టాలు, అనర్థాలను కూడా వివరించాలన్నారు. సీఎస్‌డీటీలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే గ్యాస్ డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఎస్‌ఓ వెంకటకృష్ణుడు, ఏఎస్‌ఓ జ్యోతి, సీఎస్‌డీటీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, గ్యాస్ డీలర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement