Sakshi News home page

త్వరలో మధ్యంతర భృతి!

Published Thu, Nov 21 2013 1:18 AM

government employees demands mid term allowances

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరగా మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఎంత ఇవ్వాలనే విషయమై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. ఐఆర్ ఎంత ఇవ్వొచ్చో చెప్పాలంటూ ఆర్థిక శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ తన ప్రతిపాదనలను సీల్డ్ కవర్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి సమర్పించారు. 15-20% వరకు ఇవ్వొచ్చని ఆయన సిఫారసు చేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖ తాను రూపొందించిన ఫైల్‌లో 25% వరకు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందని ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.4 వేల కోట్ల భారం పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐఆర్ నిర్ధారణపై చర్చించడానికి అధికారులు గురువారం సమావేశం కానున్నారు. శుక్రవారం సీఎస్ అధ్యక్షతన జరగనున్న భేటీలో తుది ప్రతిపాదన తయారు చేసి ముఖ్యమంత్రికి నివేదించే అవకాశం ఉంది. శనివారం లేదా సోమవారం ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
 
  ఆర్థిక శాఖ ప్రతిపాదించిన దానికంటే ఎక్కువగానే సీఎం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. 30-35% మధ్య ఐఆర్ నిర్ణయం కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే 50% ఐఆర్ కోసం పట్టుబట్టాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించే ఐఆర్ సంతృప్తికరంగా లేకపోతే నేరుగా పీఆర్సీ సిఫారసులు అమలు చేయమని ఉద్యోగ సంఘాలు కోరే అవకాశం ఉంది. మరోవైపు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ఐఆర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పీఆర్సీ ఉద్యోగ సంఘాలతో చర్చలను ఈ నెలాఖరుకు పూర్తి చేయనుంది. ఒకవైపు చర్చలు జరుపుతూ మరోవైపు ప్రతిపాదనలను పీఆర్సీ సిద్ధం చేస్తోంది. చర్చలు ముగిసిన వారం రోజుల్లో డ్రాఫ్టు నివేదికను సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తున్నామని పీఆర్సీ వర్గాలు చెప్పాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement