రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వ సేవలు | Sakshi
Sakshi News home page

రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వ సేవలు

Published Tue, Mar 1 2016 4:06 AM

Government services through ration shops

 రేషన్ డీలర్లతో ముఖ్యమంత్రి
సాక్షి, విజయవాడ : భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా అనేక రకాల ప్రభుత్వ సేవలను అందించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రేషన్ డీలర్ల పాయింట్లు నిత్యావసర వస్తువుల సరఫరా కేంద్రాలుగానే సేవలకూ ఉపయోగించుకుంటామని తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు చంద్రబాబును కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడానికి కేంద్రాన్ని ఇవ్వడమేగాక అందుకోసం రూ. నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నిత్యావసర వస్తువులను సక్రమంగా అందించాలని లేనిపక్షంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. డీలర్లు కరెక్టుగా లేకపోతే తనకు ఇబ్బందులు వస్తాయని, ప్రజాపంపిణీ వ్యవస్థ సరిగా లేకపోతే ఫలితాలు రావని తెలిపారు. డీలర్ల సంక్షేమ బాధ్యత తమదని, దాన్ని తాను చూసుకుంటానని హామీఇచ్చారు.

అయితే ఎవరు అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని చెప్పారు. ఈ పోస్ విధానం త్వరలో దేశమంతా అమలుకానుందన్నారు. ఇది డీలర్లను ఇబ్బంది పెట్టడానికి కాదని, పారదర్శకత, జవాబుదారీతనం కోసం దీన్ని పెట్టామని దీనికి అంతా సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement