అనంతపురం సెంట్రల్ : సంక్షేమ పథకాలన్నీ పేదల దరి చేరేలా చూడాలని టీడీపీ జిల్లా పరిశీలకులు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పార్టీ నేతలకు సూచించారు. శనివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అనుబంధ సంఘాల సభ్యత్వ నమోదును జిల్లా అంతటా చేపట్టాలన్నారు. శాశ్వత భవనంలో పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి త్వరలోనే శంకుస్థాపన చేయాలని సమావేశంలో తీర్మానించారు.
మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... ముస్లిం, మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో గతంలో కన్నా రెట్టింపు స్థాయిలో నిధులు కేటాయించిందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యేలు ఈరన్న, ప్రభాకర్చౌదరి, మేయర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.