టీచర్‌గా మారిన ప్రభుత్వ విప్‌ కాపు

1 Nov, 2019 09:34 IST|Sakshi
విద్యార్థులకు ప్రశ్న వేస్తున్న ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి

అనంతపురం ,కణేకల్లు: ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి టీచర్‌గా మారారు.  విద్యార్థులకు అనేక ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. వివరాల్లో కెళితే.. గురువారం మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్‌లో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఉభయచర జీవి ఏది అంటూ విద్యార్థులకు ప్రశ్నించగా కొందరు విద్యార్థులు తప్పుగా సమాధానం చెప్పారు. ఉభయచర జీవి నీరు, భూమిపై జీవిస్తుందని, ఇందుకు ఉదాహరణ కప్ప అంటూ వివరించారు. అనంతరం హిందూ, అరబిక్‌ అంకెలెన్నీ అని ప్రశ్నించి... సమాధానం రాబట్టారు. రోమన్‌ అంకెల గుర్తులేవీ అని అడిగారు. ఓవెల్స్‌ ఎన్ని? అవేవి? అని ప్రశ్నించారు. అనంతరం పలు జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి ప్రశ్నలను అడిగారు. విద్యార్థుల్లో బోలెడు విజ్ఞానం ఉందని, బాగా మెరుగుపెడితే రాణిస్తారని హెచ్‌ఎం సుధాకర్, ఉపాధ్యాయులకు సూచించారు. 

సార్‌.. మా సమస్యలు పరిష్కరించండి
‘సార్‌.. మా స్కూల్‌లో మరుగుదొడ్లు లేవు.. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం... ప్రహరీ కూడా లేదు. సమస్యలను పరిష్కరించండి’ అంటూ విద్యార్థులు ప్రభుత్వ విప్‌కు విజ్ఞప్తి చేశారు. స్కూల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకొంటానని ఆయన హామీ ఇచ్చారు. తహసీల్దార్‌ ఉషారాణీ, ఎంపీడీఓ విజయభాస్కర్, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాటిల్‌ నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆలూరు చిక్కణ్ణ, పట్టణ కన్వీనర్‌ టీ.కేశవరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పి.కేశవరెడ్డి, గౌని రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు