హెచ్‌ఎం, ఎంఈఓలకు జీపీఎఫ్ మంజూరు అధికారం! | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎం, ఎంఈఓలకు జీపీఎఫ్ మంజూరు అధికారం!

Published Wed, Sep 11 2013 2:40 AM

GPF Loans grant power to Head Master, MEOs

జిల్లా పరిషత్తు(జడ్పీ) స్కూళ్లలోని దాదాపు 3 లక్షల మంది టీచర్ల జీపీఎఫ్ రుణాలకు సంబంధించి పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ మంజూరు అధికారాన్ని జిల్లా పరిషత్తు నుంచి స్థానిక ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు అప్పగించేందుకు ఉన్నతాధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు పీఆర్‌టీయూ వెల్లడించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్తు కార్యాలయాల ద్వారా మంజూరు చేస్తున్నందున నెలల తరబడి జాప్యం జరిగి జెడ్పీ స్కూళ్ల ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు.

2002 మే నెలలో జారీ చేసిన జీఓ 40 ప్రకారం జీపీఎఫ్ లోన్స్/పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ మంజూరు చేసే అధికారం స్థానిక ఎంఈఓలకు, హెచ్‌ఎంలకు కల్పించినా అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, విద్యాశాఖ, ట్రెజరీ ఉన్నతాధికారులు, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశమై దీనిపై చర్చించారు.

జీఓ 40 అమలుకు ఉన్నతాధికారులు సానుకూలత తెలిపి త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించారని పీఆర్‌టీయూ నేతలు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో జీపీఎఫ్ ఖాతాలు సక్రమంగా నిర్వహించాలని, 2013 మార్చి నాటికి పూర్తి చేసి ఆన్‌లైన్లో పొందుపరచాలని అధికారులను నాగిరెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement