ఘనంగా గణతంత్ర వేడుక | Sakshi
Sakshi News home page

ఘనంగా గణతంత్ర వేడుక

Published Mon, Jan 27 2014 2:26 AM

grand celebrations of republic day

నిజామాబాద్‌కల్చరల్ న్యూస్‌లైన్ : గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రద్యుమ్న జెండా ఎగురవేశారు. అనంతరం స్వా తంత్య్ర స్ఫూర్తి, దేశభక్తి, సామాజిక అంశాల మేళవింపుతో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ కట్టిపడేశాయి. ఉపాధ్యాయురాలు కళాలలిత వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాలు కొనసాగాయి.

 జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి, డీఐజీ అనిల్‌కుమార్, ఎస్పీ తరుణ్‌జోషి, వివిధ శాఖాధికారులు, పార్టీల నాయకులు, ప్రముఖులు తదితరులు వీక్షించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్య గీతాలు ఆకట్టుకున్నాయి.  జిల్లాకేంద్రంలోని రామకృష్ణ విద్యాలయం, వాసవి, ఆర్చిడ్, ఆర్.బి.విఆర్.ఆర్, బ్లూమింగ్‌బర్డ్స్ పాఠశాలల విద్యార్థులతో పాటు ధర్మారం సాంఘిక సంక్షేమ పాఠశాల, సుద్దపల్లి సాం ఘిక పాఠశాల, ముబారక్‌నగర్ విజయహైస్కూల్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలతో అలరించారు. కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికలను అందుకున్నారు.

 శకటాల ప్రదర్శన
 జిల్లా చరిత్రలో మొదటిసారిగా 17శాఖల శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యాన, జిల్లానీటి యాజమాన్య సంస్థ, జిల్లాగ్రామీణాభివృద్ధి-క్రాంతి పథకం, జిల్లా గృహనిర్మాణ సంస్థ, 207 వజ్ర, అగ్నిమాపక, 108, జిల్లా వైద్యఆరోగ్య, పశుసంవర్ధక, గ్రామీణనీటి సరఫరా, జిల్లాపౌర సరఫరాల, నగరపాలక, మీసేవా, పర్యాటక, రాజీవ్ విద్యామిషన్ తదితర శాఖలు తమ పోటాపోటీగా తమ శకటాలను ప్రదర్శించాయి. గృహనిర్మాణ సంస్థ రూపొందించిన శకటాన్ని, నగరపాలక సంస్థ శకటాలను కలెక్టర్, ఎస్పీ, ఆయా శాఖాధికారులను అభినందించారు.

Advertisement
Advertisement