అమరావతి: శాసనసభలోనే కాదూ... అసెంబ్లీ బయట కూడా అధికారపక్షం దౌర్జన్యం కొనసాగింది. ఏపీ అసెంబ్లీలోని మీడియా పాయింట్ దగ్గర మంగళవారం గందరగోళం నెలకొంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ ఎమ్మెల్యేలకు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మహిళలపై వేధింపుల అంశంపై మాట్లాడుతున్న సమయంలో అక్కడకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత...వాళ్లని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, అనిత మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో మీడియా పాయింట్ దద్దరిల్లింది. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే అనిత వెళ్లిపోగా... మంత్రి పీతల సుజాత, కొంతమంది పురుష ఎమ్మెల్యేలతో అక్కడకు వచ్చి వాగ్యుద్ధానికి దిగారు. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంతో పీతల సుజాత మైక్లు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. గొడవ పెద్దది కావడంతో మార్షల్స్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.