సిద్దిపేట జోన్, న్యూస్లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం సిద్దిపేట పట్టణంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు చరిత్రాత్మకమని, ఉద్యమ చరిత్రలో ఈ దీక్షలు చిరస్థాయిగా నిలిచిపోతాయని టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన 1444వ రిలే నిరాహర దీక్షాశిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట ఊపిరిలాంటిదన్నారు. రాష్ట్ర విభజన కోసం నిరంతరం తపించిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేరనుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంకం తుదిదశలో ఉందని, ప్రస్తుతం మనం చివరి మెట్టుపై ఉన్నామని, పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రవిభజన అనివార్యమవుతుందన్నారు. తెలంగాణ కల పూర్తిగా సాకారమయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యంగా, కట్టడితో తెలంగాణ ప్రజాప్రతినిధులు ముందుకు సాగాలన్నారు. అనంతరం కోదండరాం, శ్రీనివాస్గౌడ్ దీక్ష చేపట్టిన మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరంమింపజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాపయ్య, తిరుపతిరెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్గౌడ్, వంగగాల్రెడ్డి, హైమద్, మూర్తి అశోక్రెడ్డి పాల్గొన్నారు.
దీక్షలకు కోదండరాం సంఘీభావం
సిద్దిపేట అర్బన్: తెలంగాణ కల నెరవేరే సమయంలో సీమాంధ్రుల చర్యలతో ఇరు ప్రాంతాల ప్రజలు మధ్య వైష మ్యాలు పెరిగేలా ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. సిద్దిపేటలో చేపడతున్న దీక్షల్లో మంగళవారం రావురూకులకు చెందిన కరుణ గ్రూపు మహిళ సభ్యులు రేణుక, ఎల్లవ్వ, మంజుల, శకుంతల, లక్ష్మి, విమల, నిర్మల పాల్గొన్నారు. వీరి దీక్షలకు ప్రొఫెసర్ కోదండరాం,టీఎన్జీవో నాయకులు శ్రీనివాస్గౌడ్, పాపయ్య,వంగగాలిరెడ్డి, మూర్తి అశోక్రెడ్డి, హైమద్, బూర మల్లేశం, ఫసీబాయి, బాబు, పర్శరాములు, రవి, కమలాకర్, సురేందర్, భైరవరెడ్డి పాల్గొన్నారు.