కల చెదిరి..తనువు చాలించి..! | Sakshi
Sakshi News home page

కల చెదిరి..తనువు చాలించి..!

Published Tue, Jan 6 2015 2:41 AM

కల చెదిరి..తనువు చాలించి..! - Sakshi

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
భర్తే చంపి ఉరివేశాడంటున్న మృతురాలి తల్లిదండ్రులు
కర్నూలు నగరంలో ఘటన
మృతురాలు తిరుపతి వాసి

 
కర్నూలు: ప్రేమ కోసం కనిపెంచిన తల్లిదండ్రులను కాదనుకుంది. కులం పట్టింపులు లేవని.. నీవు లేకపోతే నేను లేనని మాయ మాటలు చెప్పిన ప్రియుడిని నమ్మింది. జీవితాంతం అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. వివాహం అయిన తరువాత ఆమెకు తెలిసింది తన కలలు కల్లలయ్యాయని. అటు తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేక భర్త వేధింపులు భరించలేక బలవంతంగా తనువు చాలింది. ఈ ఘటన కర్నూలు నగరం గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన ఈశ్వరరెడ్డి, సి.జయశ్రీ అక్కడే విద్యోదయ స్కూల్, కాలేజిలో డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఇదే సమయంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. పెళ్లికి ఇంట్లో పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో ఇంటినుంచి పారిపోయారు. గత అక్టోబర్ 20వ తేదీన మహానందిలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఈశ్వరరెడ్డికి కర్నూలులో సేల్స్‌మెన్‌గా ఉద్యోగం వచ్చింది. వీరిద్దరూ కర్నూలు నగరంలోని గాంధీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. కొన్ని రోజులుగా ఈశ్వర్ రెడ్డి భార్యను వేధించడం ప్రారంభించాడు. తనకు రూ.30లక్షల కట్నం కావాలని, కులం తక్కువ వారని హింసించేవాడు.

ముఖం చూపించవద్దని భార్యను సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఈ విషయాలను ఆమె పలుమార్లు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సైతం తన చిన్నాన్న సి.నాగరాజుకు ఫోన్‌చేసి తిరుపతికి వస్తున్నానని చెప్పింది. అయితే అదేరోజు రాత్రి 9.45 గంటలకు నాగరాజుకు భర్త ఈశ్వరరెడ్డి ఫోన్‌చేస్ఙ్ఙి మీ అమ్మాయి తలుపులకు గడియ పెట్టుకుని బయటకు రావడం లేదని, వెంటనే రావాలి** అని చెప్పాడు. తిరుపతి నుంచి జయశ్రీ కుటుంబసభ్యులు సోమవారం ఉద యం గాంధీనగర్‌కు చేరుకున్నారు. త లుపులు తెరిచి చూసేలోగా అప్పటికే ఆమె గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని చని పోయి ఉంది. వెంటనే వారు కర్నూలు టూటౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ ముల్కన్న ఆధ్వర్యంలో పోలీస్ బృందం సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించింది. భర్తే తమ కుమార్తెను చంపి ఉరివేసి ఉంటాడని జయశ్రీ తల్లిదండ్రులు మునికృష్ణయ్య, సత్యవేణి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement