అదనపు కట్నం కోసం భార్య గొంతు కోశాడు | Sakshi
Sakshi News home page

అదనపు కట్నం కోసం భార్య గొంతు కోశాడు

Published Thu, Aug 22 2013 8:28 AM

Husband kills wife for additional dowry at Madanapalle

మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: అదనపు కట్నం తెచ్చివ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్యను గొంతుకోసి, ఇంటికి తాళాలు వేసి పరారైన ఘటన బుధవారం మదనపల్లెలో వెలుగుచూసింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఎదురుగా పటేల్ రోడ్డుకు చెందిన ఖాదర్‌బాషా, రజియా దంపతుల కుమార్తె రేష్మ(22)ను సైదాపేటకు చెందిన ఇస్మాయేల్ కుమారుడు ఆటోడ్రైవర్ మహ్మద్‌జానీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన పెళ్లి చేశారు.

వివాహ సమయం లో రూ.60వేల నగదు, 5తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. పెళ్లికి రూ.2లక్షలు ఖర్చు చేశారు. వారు కొంతకాలం సైదాపేటలోనే కాపురమున్నారు. నెలరోజుల క్రితం ఎగువకురవంకకు మారారు. మహ్మద్‌జానీకి మొబైల్ షాపు పెట్టుకోవాలనే ఆలోచన వచ్చిం ది. అదనపు కట్నం తేవాలని భార్యను వేధింపులకు గురిచేశాడు. కుమార్తె కాపురం సజావుగా సాగాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికొచ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులు ఎంతో కొంచెం ఇచ్చి పంపేవా రు. తనకు రూ.2లక్షలు తెచ్చిస్తేనే కాపురానికి రావాలని భార్యను పుట్టింటికి పంపించాడు.

రెండు రోజులైనా భార్య రాకపోవడంతో ఆదివారం సాయంత్రం అత్తగారింటికి వెళ్లి వెంట తీసుకెళ్లాడు. డబ్బు విషయమై రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. ఆగ్రహించిన జానీ కత్తితో భార్య గొంతుకోసి హత్య చేశాడు. ఆ రో జు రాత్రి అక్కడే గడిపి ఇంటికి తాళాలు వేసుకుని నేరుగా అత్తగారింటికెళ్లాడు. ఇంటి బాడుగ కట్టాలని రూ.2వేలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు మంగళవారం సాయంత్రం కిటికీలో నుంచి చూడగా రేష్మ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. మృ తురాలి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని బిడ్డ మృతదేహంపై పడి బోరున విలపించా రు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారుజామున డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ వంశీధర్‌గౌడ్, ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తహశీల్దారు శివరామిరెడ్డి పంచనామా నిర్వహించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 డబ్బుకోసం బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు
 మొబైల్ షాపు పెట్టుకోవాలని డబ్బు తె మ్మని బిడ్డను పదేపదే ఇంటికి పంపేవా డు. పెళ్లి చేసి మేము అప్పటికే అప్పుల్లో ఉన్నాం. నిదానంగా ఆలోచిద్దామని చెప్పి ఇంటికి పంపాం. ఆ దుర్మార్గుడు డబ్బు కోసమే మా బిడ్డ గొంతుకోసి హత్య చేశాడు. వాడికీ అదే శిక్ష వేయాలి.
 - మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు
 

Advertisement
Advertisement