బెదిరించిన భార్యను కాల్చేసిన భర్త | Sakshi
Sakshi News home page

బెదిరించిన భార్యను కాల్చేసిన భర్త

Published Mon, May 29 2017 1:35 AM

husband set afire wife in firangipuram

ఫిరంగిపురం(తాడికొండ): వ్యసనాలకు బానిసైన భర్త తాగొచ్చి నిత్యం వేధిస్తుండటంతో విసిగి పోయిన ఆ ఇల్లాలు అతన్ని బెదిరించేందుకు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆ దుర్మార్గుడు నన్నే బెదిరిస్తావా అంటూ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు ఆహుతైంది. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు రైల్వే స్టేషన్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నుదురుపాడు రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న నండూరి మురళీకృష్ణకు గుంటూరు ఏటుకూరుకు చెందిన శివాలశెట్టి శివశంకర్‌ సోదరి రాజేశ్వరి (33)తో 12 ఏళ్ల కిందట వివాహమైంది.

కొన్నేళ్ల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి కుమార్తె కావ్య, కుమారుడు వంశీకృష్ణ సంతానం. వ్యసనాలకు బానిసగా మారిన మురళీకృష్ణ నిత్యం మద్యం తాగి భార్యను డబ్బు కోసం వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లి భార్యతో ఘర్షణకు దిగాడు. వేధింపులు భరించలేని రాజేశ్వరి భర్తను బెదిరించేందుకు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుంది. మద్యం మత్తులో ఉన్న మురళీకృష్ణ నన్ను బెదిరిస్తావా..నిన్ను తగులబెడతానంటూ అగ్గిపుల్ల గీసి నిప్పంటించి పరారయ్యడు. ఘటనను చూస్తున్న పిల్లలు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు మంటలార్పి రాజేశ్వరిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది.

Advertisement
Advertisement