హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మార్చుకునేందుకు వారిపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. మూడేళ్లుగా సీఎంగా ఉన్న తనకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకి, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ సమస్యను అధిగమించినా...కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ రావడం లేదన్నారు. సమైక్యం కోసం బయట మాట్లాడేది 30 శాతమే మాత్రమేనని, అంతకు మూడింతలు అధిష్టానం దగ్గర మాట్లాడానని తెలిపారు. విభజన అంశంపై గతంలో ఇందిరా గాంధీ మాట్లాడాన్ని ప్రసంగాన్ని గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని తెలిపారు. అసెంబ్లీలో విభజనపై అన్ని విషయాలతో చర్చిస్తామన్నారు. సమైక్యమా? కాంగ్రెస్ పార్టీనా అనేది రాకూడదనుకుంటున్నానని, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని కిరణ్ తెలిపారు. అసెంబ్లీకి డ్రాఫ్ట్ బిల్లు ఎప్పుడొస్తుందో తెలీదని, అసెంబ్లీ ప్రొరోగ్ విషయం చాలా చిన్న విషయమన్నారు.
తాను సీఎంగా ఉన్న కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. విభజనకు సంబంధించి మీడియా అడగగా.. ఆ విషయలో ఏం చేస్తున్నానో రోజు చూస్తున్నే ఉన్నారు కదా?ఎదురు ప్రశ్నించారు. తన పదవీ కాలంలో విద్యారంగంలో పారదర్శకతను తీసుకొచ్చామని, మీ సేవా ద్వారా 192 సేవలు తీసుకొచ్చామని తెలిపారు. ఇంకా మీ సేవను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.